iphone demand in india : ఒక్క నిమిషం గాలి పీల్చుకోకుండా అయినా ఉండగలరేమో కానీ చేతిలో ఫోను లేకుండా మాత్రం ఎవరూ ఉండలేరు. ఎందుకంటే ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేస్తోంది స్మార్ట్ ఫోన్. అందుకే ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు కొనుగోలు చేసే వాటిలో ఈ స్మార్ట్ ఫోన్ల విక్రయాలే ఎక్కువగా ఉంటాయి. అందుకు తగ్గట్టే ఆయా కంపెనీలు కూడా రకరకాల కొత్త డిజైన్లు, ఫీచర్స్ తో వాటిని మార్కెట్లలోకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నాయి.
ఇదే సమయంలో ఈ మధ్య కాలంలో భారత్ నుంచి అమెరికాకు స్మార్ట్ ఫోన్ ఎగుమతులు కూడా భారీగా పెరిగిపోయాయని తెలిసింది. గత మూడు త్రైమాసికాలలో విలువ పరంగా చూస్తే నాన్ ఇండస్ట్రియల్ డైమండ్ల ఎగుమతులను కన్నా ఈ స్మార్ట్ ఫోన్ల ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి. అంతలా స్మార్ట్ ఫోన్ డిమాండ్ పెరిగిపోయింది.
జూన్తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిసింది. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ గణాంకాలు తెలిపాయి. ఇదే సమయంలో డైమండ్ల ఎగుమతులు 1.44 బిలియన్ డాలర్ల వద్దే ఉన్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో యాపిల్ ఐఫోన్లే కీలక పాత్ర పోషించాయట.
ALSO READ : వాషింగ్ మెషీన్ కొనే ప్లాన్లో ఉన్నారా? – అమెజాన్లో ఈ మెషీన్లు ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!
గత డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 1.42 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అదే సమయంలో డైమండ్ల ఎగుమతులు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆ తర్వాత త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు పెరిగి 2.02 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ సెప్టెంబర్తో త్రైమాసికం ముగిసింది. ఈ త్రైమాసికంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతుల్లో స్మార్ట్ ఫోన్లు నాలుగో స్థానాన్ని భర్తీ చేశాయి.
మొబైల్ డివైజ్ల కోసం భారత్ తీసుకొచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం విజయం సాధించింది అనడానికి పెరిగిన ఈ స్మార్ట్ ఫోన్ ఎగుమతులే సూచిస్తున్నాయి. పీఎల్ఐ ఇండ్రడ్యూస్ చేయడానికి ముందు ఈ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల విలువ 1.6 బిలియన్ డాలర్ల దగ్గర ఉండేది.
అయితే భారత్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో యాపిల్ ఐ ఫోన్లదే అధిక వాటా ఉందట. 2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి మొత్తం స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 11.1 బిలియన్ డాలర్లు ఉండగా, అందులో 5 బిలియన్ డాలర్ల విలువైన యాపిల్ ఐఫోన్లు ఉన్నాయి. అంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ ఎగుమత్తులో ఐఫోన్లు గణనీయ పాత్ర పోషించాయి అని చెప్పొచ్చు. ఇక 2024 ఆర్థిక సంవత్సరంలోనూ ఐఫోన్ ఎగుమతుల విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. దీంతో భారత్ నుంచి మొత్తం స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో ఇవి 66 శాతానికి చేరాయి. ఏది ఏమైనా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో లాంఛ్ అవుతున్న కొత్త అప్డేట్స్ తో కొనుగోలుదారులు సైతం పెరిగిపోతున్నారు.