Digvijay: దిగ్విజయ్ వచ్చారు. రెండు రోజులు చర్చలు జరిపారు. సీనియర్లు, వలస నేతలు అందరి వాదనలు విన్నారు. గురువారం నాటి గాంధీభవన్ గొడవను కళ్లారా చూశారు. విన్నపాలు అన్నీ విన్నాక.. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిపోయారు. వెళ్లే ముందు, కాంగ్రెస్ లో మరింత కాక రేపి వెళ్లారు. ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరోక్షంగా కాంగ్రెస్ తిరుగుబాటు సీనియర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు దిగ్విజయ్. ఏవైనా సమస్యలు ఉంటే అంతర్గతంగానే చర్చించాలని.. పార్టీ లైన్ దాటితే ఎంత పెద్ద నేతలైనా సహించబోమన్నారు. నేతలంగా పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలని సూచించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానంటూ సీనియర్లను రిక్వెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని.. బీఆర్ఎస్ పై పోరుకు నేతలంతా సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు దిగ్విజయ్. అంతా కలిసి పని చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా కాకున్నా.. తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డినే సుప్రీం అనేలా కామెంట్లు చేశారు. అప్పట్లో అనేక మంది సీనియర్లు ఉన్నా.. వైఎస్సార్ తక్కువ వయసులోనే పీసీసీ చీఫ్ గా ఎంపికై.. రాణించారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ లో తాను కూడా.. సీనియర్లను కాదని టాప్ లీడర్ గా ఎదిగానని చెప్పారు. పార్టీలో జూనియర్, సీనియర్ అనే తేడా ఏమీ ఉండదని.. సామర్థ్యమే కాంగ్రెస్ లో ప్రాతిపదికగా ఉంటుందని తేల్చి చెప్పారు దిగ్విజయ్.
దిగ్గీరాజా మాటలు టి.కాంగ్ లో రేవంత్ రెడ్డినే ఫైనల్ అనేలా ఉన్నాయని అంటున్నారు. వైఎస్సార్ తో పోల్చి.. జూనియర్ గా ఉన్నా పీసీసీ చీఫ్ గా సక్సెస్ అయ్యారని గుర్తు చేయడం చూస్తుంటే.. రేవంత్ ను సైతం మరో వైఎస్సార్ గా అధిష్టానం చూస్తోందనే మెసేజ్ ను స్పష్టంగా ఇచ్చారని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీనియర్లంతా పని చేయాల్సిందేనని సూటిగా చెప్పినట్టే..అంటున్నారు.