Musi politics: మూసీ ప్రక్షాళన కబ్జా బాబుల గుండెల్లో అలజడి మొదలైందా? పెద్దల ఫామ్హౌస్ కాపాడుకునేందుకు పేదలను ముందుపెట్టి నేతలు రంగంలోకి దిగారా? మూసీ ప్రక్షాళనలో నిప్పులు రాజేస్తున్నదెవరు? దీని వెనుక కొందరి రియల్ ఎస్టేట్ స్పాన్సర్ షిప్ ఉందా? అవుననే సంకేతాలు పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నాయి.
హైదరాబాద్కు ముప్పు పొంచి వుందని పర్యావరణ వేత్తలు పదేపదే వార్నింగ్ ఇస్తున్నారు. మొన్న వయనాడ్.. నిన్న విజయవాడ.. నేడు నేపాల్.. రేపు ఏ నగరమో అన్న ప్రశ్న మొదలైంది. ప్రకృతి కన్నెర్ర చేస్తే దాని పర్యావసనాలు ఊహించలేము కూడా. ఏ ఒక్కరూ మిగలరు.
హైదరాబాద్ సిటీలో ఇబ్బడిముబ్బడిగా చెరువులు, కాలువలను కబ్జా చేసి అక్రమ కట్టడాలు వెలిశాయి. ఒకప్పుడు లేక్ సిటీగా పేరుపొందిన భాగ్యనగరం, కబ్జారాయుళ్ల తో రూపురేఖలు మారిపోయి ప్రమాదం అంచున వేలాడుతోంది. చిన్నపాటి వర్షం పడితే రోడ్లపైకి నీరు వచ్చే పరిస్థితి నెలకొంది. ఒకరోజంతా వర్షం పడితే భాగ్యనగరం పరిస్థితి ఏంటన్నది ప్రజల్లో వచ్చే ప్రశ్న. చెన్నై, ముంబై నగరాలను సైతం చూశాము.
గడిచిన పదేళ్లలో రియల్టర్లు ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. అఫ్ కోర్స్.. ప్రభుత్వం కూడా పర్మిషన్లు అదే విధంగా ఇచ్చేసింది. హైదరాబాద్ సిటీని మార్చేస్తామంటూ ఆనాటి పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. దీనిపై పొలిటికల్ సర్కిల్స్లో రకరకాలుగా ప్రచారం జోరందుకుంది.
ALSO READ: భయపెట్టు.. రెచ్చగొట్టు.. మూసీపై బీఆర్ఎస్ డబుల్ గేమ్? అప్పుడలా.. ఇప్పుడిలా..
మూసీ ప్రక్షాళనపై నిప్పు రవ్వలు రాజేస్తుందెవరు? రియల్ ఎస్టేట్ స్పాన్సర్ షిప్ ఉందా? దీని వెనుకుండి నడిపిస్తున్నదెవరు? గత ప్రభుత్వంలో లబ్ది పొందిన కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఫండింగ్ చేస్తున్నట్లు అందులోని సారాంశం. మూసీని అడ్డుకునేందుకు సేఫ్ గేమ్ మొదలైపోయింది.
వాస్తవానికి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పిల్లలకు సమీపంలో స్కూళ్లు, కాలేజీల్లో సైతం సీట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది అధికార ప్రభుత్వం. ఈ క్రమంలో చాలామంది అక్కడి నుంచి వెళ్లారు.. వెళ్తున్నారు కూడా. అంతలో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. లేకుంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదన్నది పర్యావరణ వేత్తల మాట.