Kaikala: 1935లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా కౌతవరంలో జన్మించారు కైకాల సత్యనారాయణ. గుడ్లవల్లేరులో హైస్కూల్ విద్య అభ్యసించారు. విజయవాడ, గుడివాడలలో కాలేజీ పూర్తి చేశారు. నాటకాల మీద ఇంట్రెస్ట్ తో ఇంటర్ లోనే వివిధ నాటక సంస్థల తరపున రాష్ట్రమంతా పర్యటించి నాటకాలు వేశారు. 1955 నాటికే డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెందారు. రాజమహేంద్రవరంలో సత్యనారాయణ కుటుంబానికి కలప వ్యాపారం ఉండటంతో కొంతకాలం అక్కడ ఉన్నారు. స్నేహితుడి సలహాతో సినిమాల్ వేషాల కోసం మద్రాసు వెళ్లారు.
మొదట ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థలో సహాయ కళా దర్శకుడిగా చేరారు. ‘కొడుకులు-కోడళ్లు’, ‘దొంగరాముడు’ సినిమాల్లో ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యాయి. దీంతో ఆయన సినీ ప్రస్థానం మరింత ఆలస్యం అయింది. ఆ తర్వాత నిర్మాత డి.ఎల్. నారాయణ ‘సిపాయి కూతురు’ చిత్రంలో కైకాలకు తొలి అవకాశం ఇచ్చారు. అయితే, ఆ సినిమా ఫ్లాఫ్ కావడంతో మళ్లీ నిరాశే.
3 ఏళ్ల కాంట్రాక్టు మీద, నెలకు 300 జీతానికి ఓ సినీ సంస్థలో పని చేశారు కైకాల. కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్కు డూపుగా నటించారు. 1960లో ఎన్టీఆర్ చొరవతోనే ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’లో గెస్ట్ రోల్ వేశారు. సత్యనారాయణ టాలెంట్ గుర్తించిన విఠలాచార్య.. ‘కనకదుర్గ పూజా మహిమ’లో సేనాధిపతి పాత్ర ఇవ్వడం.. ఆ రోల్ లో మెప్పించడంతో ఇక సత్యనారాయణ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. చిన్నా, పెద్ద పాత్రలనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు సత్యనారాయణ. అలా అలా.. ఏకంగా 777 చిత్రాల్లో నటించి..రాణించారు.
1962 నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. పౌరాణికాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ‘స్వర్ణగౌరి’లో శివుడిగా.. ‘మదన కామరాజు కథ’లో ధర్మపాలుడిగా, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో కర్ణుడిగా, ‘నర్తనశాల’లో దుశ్శాసనునిగా నటించి మెప్పించారు. ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’లో దుర్యోదనుడిగా, ‘దాన వీర శూరకర్ణ’లో భీమునిగా, ‘సీతా కల్యాణం’లో రావణాసురుడిగా అసమాన నటన ప్రదర్శించారు. లవకుశ, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ పాండవీయం మరికొన్ని నటనాద్భుతాలు.
కేవలం పౌరాణిక పాత్రలనే కాదు, సాంఘిక చిత్రాలతోనూ మెప్పించారు. ‘అడవి రాముడు’, ‘వేటగాడు’ లాంటి సినిమాల్లో విలన్ గా భయపెట్టారు. పాపం పసివాడు, మానవుడు దానవుడు, యమగోల, సోగ్గాడు, అడివి రాముడు, దానవీరశూర కర్ణ, కురుక్షేత్రం. డ్రైవర్ రాముడు, అగ్నిపర్వతం, విజేత, కొండవీటి దొంగ, కొదమసింహాం, యమలీల, మురారి, అరుంధతి లాంటి కమర్షియల్ చిత్రాల్లో మెప్పించారు. ‘జిస్ దేశ్ మే గంగా బెహతీ హై’ అనే బాలీవుడ్ మూవీలో ‘ప్రాణ్’ గా ఆకట్టుకున్నారు. ‘మహర్షి’ ఆయన చివరి సినిమా.
రమా ఫిలిమ్స్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు సత్యనారాయణ. ‘గజదొంగ’, ‘ఇద్దరు దొంగలు’, ‘కొదమ సింహం’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల మొగుడు’ వంటి చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు చిరంజీవి సహ నిర్మాతగా ఉన్నారు.
మొత్తం 777 సినిమాలు. అందులో 28 పౌరాణికాలు. 51 జానపద చిత్రాలు. 9 చారిత్రక సినిమాలు. దాదాపు 200 మంది దర్శకులతో కలిసి పనిచేశారు. 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు శతదినోత్సవాలు.. 10 సినిమాలు ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ ఆడాయి. సత్యనారాయణ తన కెరీర్లో చిన్నా, పెద్దా వేషాలు కలిపి 800లకు పైగా పాత్రలు పోషించారు.
కైకాల సత్యనారాయణను అనేక అవార్డులు వరించాయి. ‘కళా ప్రపూర్ణ’, ‘నవరస నటనా సార్వభౌమ’ ఇలా అనేక బిరుదులు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.
రాజకీయాల్లోనూ రాణించారు కైకాల సత్యనారాయణ. టీడీపీ తరపున 1996లో మచిలీపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. వయసు మీదపడటంతో రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 87 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.