BjP vs DMK: ఆ యువ రాజకీయ నేత నాడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఏకంగా సనాతన ధర్మంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ యువనేతకు ప్రమోషన్ రావడంతో.. బిజెపి నుండి విమర్శల జోరు అందుకుంది. ఆయన ఎవరో కాదు తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం. ఇక్కడ రాజకీయంగా ఏదైనా జరగవచ్చు. ఆ క్రమంలోనే ఇటీవల తమిళనాడులో అనూహ్యంగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ పార్టీలో పలు మార్పులు చేయాలని నిర్ణయించుకుని, ముందుగా తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను రాజకీయ రంగ ప్రవేశం చేయించారు. దీనితో యువతకు తమ పార్టీలో ప్రాధాన్యత కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఉంటుందని స్టాలిన్ భావించారు. అలాగే ఉదయనిధికి మంత్రిగా సైతం చోటు దక్కించారు స్టాలిన్. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణకు పూనుకున్న సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ కు ప్రభుత్వంలో నెంబర్-2 స్థానాన్ని కల్పించారు. అంటే డిప్యూటీ సీఎం హోదాలో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అలాగే మరో ఇద్దరు సైతం మంత్రి వర్గంలోకి చేరారు. వారి చేత సైతం గవర్నర్ ప్రమాణం చేయించగా.. తన కుమారుడికి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉదయనిధి డిప్యూటీ సీఎం కాగానే.. డీఎంకే నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగారు. ఇది ఇలా ఉంటే గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
Also Read: Ponnam Prabhakar : హస్తం ఆదుకుంటుంది… కారు ట్రాప్లో పడొద్దు
గతంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించే లక్ష్యంతో డీఎంకే స్థాపించబడిందని, అది నెరవేరే వరకు తాము విశ్రమించమని ప్రసంగించారు. ఆ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయని చెప్పవచ్చు. తాజాగా ప్రమోషన్ పొందిన డిప్యూటీ సీఎం ఉదయనిధికి బిజెపి వైపు నుండి విమర్శల వస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందిస్తూ.. సనాతన ధర్మంపై ఉదయనిది స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ.. ఇండి అలయన్స్ ఆధ్వర్యంలో తమిళనాడుకు ఉపముఖ్యమంత్రిగా నియమించడం తగదన్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఉపసమహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మరికొందరు బీజేపీ నేతలు సైతం స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.