హైదరాబాద్ మహానగరంలో మళ్లీ వర్షం పడింది. సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. దీంతో ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడలో, గండిపేట, మణికొండ, నార్సింగి, కాటేదాన్ సహా పలు ప్రాంతాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. మరోవైపు శేరిలింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా ఐటీ జోన్ లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.
సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న ద్రోణి.. తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు విస్తరించిందని పేర్కొంది. హైదరాబాద్లో ఇవాళ ఉదయం పొడి వాతావరణం ఉంటుందని, ఉదయం ఎండగా ఉన్నా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
also read : గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్స్
జిల్లాల్లోనూ వర్షాలే…
వరంగల్, కరీంనగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది ఐఎండీ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.