AP Politics: ఏపీలో రాజకీయం రంజుగా మారింది. తిరుమల లడ్డులో కలిపిన నెయ్యి కల్తీ వివాదానికి సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీ మధ్య వార్ అంతా ఇంతా కాదు. దీనితో తాజా రాజకీయ స్థితిగతులు గమనిస్తే వైసీపీకి ఇక గడ్డు కాలమేనా.. ఈ ముప్పేట దాడిని మాజీ సీఎం వైయస్ జగన్ తట్టుకొనే పరిస్థితి ఉందా.. లేదా అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల మదిలో మెదులుతున్నాయనే చెప్పవచ్చు.
ఎన్నికల ఫలితాల సమయం నుండి వైసీపీ క్యాడర్ ను కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంచుకుంది. కేవలం 11 శాసనసభ స్థానాలకే పరిమితమైన వైసీపీ అప్పుడప్పుడే… ఫలితాల షాక్ నుండి కోలుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా సీఎం చంద్రబాబు భారీ షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పవిత్రమైన తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి ఉపయోగించారని రాజకీయ దుమారానికి చంద్రబాబు తెర లేపారు. ఇక పార్టీ క్యాడర్ ను కాపాడుకుందామని వైసీపీ అధిష్టానం భావించిన సమయంలో.. కల్తీ నెయ్యి అంశం వివాదం కావడం, యావత్ దేశం మొత్తం వైసీపీ వైపు చూడడంతో ఆ క్యాడర్ కి కొత్త తలనొప్పి వచ్చిందనే చెప్పవచ్చు. అయితే టిడిపి, జనసేన క్యాడర్ రోజూ ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసి.. ఈ మహాపాపం వైసీపీదే అంటూ ఆరోపణలు గుప్పించారు. దీనికి టైట్ ఫైట్ ఇచ్చేందుకు వైసీపీ సైతం అదే తరహా ఎదురుదాడికి దిగింది. ఇలా లడ్డు వివాదం సాగుతున్న క్రమంలో వైసీపీ నుండి వలసలు పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చాయి.
మాజీ సీఎం జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇంకా మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరి వైసీపీకి షాక్ ఇచ్చారు. అయితే ఈ వలసల పర్వాన్ని వైయస్ జగన్ అంతగా పట్టించుకోక పోయినా.. ఇక మొదలైంది.. ఇంకా వలసలు ఉన్నాయంటూ.. బాలినేని బాంబ్ పేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలలో గల వైసీపీ ఛోటామోటా నాయకులు అక్కడక్కడా టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇలా ఓ వైపు లడ్డు వివాదం, మరో వైపు వలసలు వైసీపీ అధిష్టానంను కలవర పెడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ ఆత్మరక్షణలో ఉండగా.. తిరుమలకు వెళ్లాలనుకున్న జగన్ కు డిక్లరేషన్ వివాదం ఒకటి మళ్ళీ షాకిచ్చింది. దీనితో పర్యటన రద్దు చేసుకున్నా.. జగన్ తిరుమల పర్యటనకు వెళ్లి ఉంటేనే.. పార్టీకి మైలేజ్ వచ్చేదని వైసీపీలోని కొందరి వాదన.
Also Read: Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..
రాష్ట్ర కాంగ్రెస్ అద్యక్షురాలిగా ఉన్న వైయస్ షర్మిళ కూడా నేను సైతం అంటూ.. వైసీపీపై విమర్శలకు పదును పెట్టారు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ.. బాహాటంగానే ఆమె విమర్శలు చేశారు. ఇలా వైసీపీకి ఒకటి తర్వాత ఒకటి తలనొప్పులు వచ్చిన క్రమంలో.. బీజేపీ సైతం నెయ్యి కల్తీకి సంబంధించి.. వైసీపీ వైపే వేలెత్తి చూపింది. ఈ క్రమంలోనే జగన్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శలు చేయగా, మరుసటి రోజు మాజీ మంత్రి పేర్ని నాని కూడా బిజెపి నాయకురాలు మాధవీలతపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ తను అధికారంలో ఉన్న సమయంలో కొంత మైత్రి మెయింటెన్ చేయగా, ఎన్నికల్లో ఓటమి అనంతరం స్తబ్దతగానే ఉన్నారు. కానీ బీజేపీ నేతలు విమర్శల ధాటికి.. వైసీపీ కూడా ప్రతి విమర్శలు ప్రారంభించింది. ఇలా ఏపీలో ఎన్నికల ఫలితాల సమయం నుండి.. వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతుండగా, కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని, ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని వైసీపీ వాదిస్తోంది. ఏదిఏమైనా ఈ ఐదేళ్లు పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసుకొని, రానున్న ఎన్నికల సమయానికి మళ్ళీ బలోపేతం కావాలన్న మాజీ సీఎం జగన్ కోరిక నెరవేరేనా.. లేక అప్పటికీ క్యాడర్ మాయమయ్యేనా అన్నది ఇంకా కొద్ది రోజులు వేచి చూసి అంచనా వేసే పరిస్థితి ఉంటుందని విశ్లేషకుల అంచనా.