Minister Sridhar Babu: తెలంగాణలో హైడ్రా అంటేనే ప్రజలకు ఒక రకమైన సంశయం ఉన్న పరిస్థితుల్లో.. రేవంత్ సర్కార్ భాదితులకు గుడ్ న్యూస్ చెప్పింది. బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలో గల అక్రమ కట్టడాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా ముందడుగు వేస్తోంది. వరదల సమయంలో ప్రజల ప్రాణ నష్టాన్ని నివారించేందుకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంటుండగా.. ఓ వర్గం కూల్చివేతలకు వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం కీలక ప్రకటన జారీ చేశారు. అక్రమ కట్టడాలను మాత్రమే తాము కూల్చి వేస్తున్నామని, అకస్మాత్తుగా వచ్చే వరదల సమయంలో ప్రజలెవరూ ఇబ్బందుల పాలు కాకూడదనే తమ ఉద్దేశమన్నారు.
కాగా ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ మాత్రం.. అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రజలకు మద్దతు తెలుపుతుండగా.. కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ఆక్రమణదారులకు మద్దతు తెలపడం సమంజసం కాదని, అది కూడా తాము పేదల గృహాలు కూలుస్తున్నట్లు బిఆర్ఎస్ అబద్దపు ప్రచారం సాగిస్తుందన్నారు. ఇదే విషయంపై తాజాగా మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అయితే తమది పేదల ప్రభుత్వమని, తాము వారికి అండదండగా నిలుస్తామన్నారు. హైడ్రా అంటే కేవలం ఆక్రమణదారులకు మాత్రమే భయమని, పేదలు ఎవరూ ఆక్రమణలకు పాల్పడి గృహాలు నిర్మించుకోరని తెలిపారు. కొందరు అవకాశవాదులు కావాలని రెచ్చగొడుతూ.. పేదలను ముందు ఉంచి డ్రామాలు ఆడుతున్నారన్నారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పే నైజం తమది కాదని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Also Read: Mann Ki Bath: ఈయన సామాన్యుడు కాదు.. ఏకంగా ప్రధాని మెప్పు పొందాడుగా..
మూసీ నదిని పరిరక్షించుకోవాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, రివర్ బెడ్ లో గల అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుందని మంత్రి తెలిపారు. పేదల ఇళ్లు పడగొట్టాలని ప్రభుత్వం చూడదని, మూసీ భాదితులకు డబుల్ బెడ్ రూమ్ లు తప్పక ఇస్తామన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం రేవంత్ ముందున్న లక్ష్యంగా మంత్రి అన్నారు. బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తూ.. తన ఉనికిని కాపాడుకొనేందుకు తాపత్రయ పడుతుందన్నారు. మల్లన్న సాగర్ భూనిర్వాసితులకు గత ప్రభుత్వం ఏమి చేసిందో తెలపాలని మంత్రి ప్రశ్నించారు. పేదలు భయపడాల్సిన పని లేదని, తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమంటూ శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. అనధికారికంగా అనుమతులు ఇచ్చిన ఏ అధికారిని కూడా వదిలే ప్రసక్తే లేదని, అటువంటి వారి జాబితా కూడా సిద్దం చేసుకుంటామన్నారు.
కాగా మంత్రి ఇచ్చిన ప్రకటన మూసీ భాదితులకు ఊరట కలిగించిందని చెప్పవచ్చు. భాదితులకు న్యాయం చేస్తామని, భవిష్యత్ లో రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఆక్రమణలను తొలగిస్తున్నట్లు హైడ్రా ఇప్పటికే ప్రకటించింది. అలాగే తాము పక్కా ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నట్లు.. బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలోకి వచ్చే ఆక్రమణలను కూల్చడం ఖాయమంటూ కమిషనర్ తెలిపారు.