Telangana Government Decision to Change the Airport Metro Alignment: హైదరాబాద్ మెట్రోకు సంబంధించి కీలక అడుగు ముందుకుపడింది. మెట్రో రెండో దశ పనులు అతిత్వరలోనే పట్టాలెక్కనున్నాయి. వీటికి సంబంధించిన డీపీఆర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవలే మెట్రో సెకెండ్ ఫేజ్ డీపీఆర్ల తయారీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మెట్రో ఎండీ.. కారిడార్ల అలైన్మెంట్ తో పాటు కీలకమైన అంశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఈ క్రమంలో గతంలో నిర్ణయించిన ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్-బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైనును ఖరారు చేసింది. వివిధ ప్రత్యామ్నాయాల గురించి లోతైన చర్చల తర్వాత, మెట్రో రెండో దశ కారిడార్ల డీపీఆర్లను ఆమోదం తెలపనుంది. మొత్తం ఆరు కారికార్లలతో మెట్రో సెకెండ్ ఫేజ్ ఉండనుంది.
కారిడార్ 4.. నాగోల్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ పొడవు.. ఎల్ బి నగర్, కర్మన్ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డిఆర్డిఓ, చంద్రాయన్ గుట్ట, మైలార్దేవ్పల్లి, ఆరంఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా నేషనల్ హైవే మీదుగా ఈ మార్గం ఉంటుంది. మొత్తం 36.6 కిలీమీటర్ల పొడవులో, 35 కిలోమీటర్ల ఎలివేట్ చేయబడుతుంది. అలాగే 1.6 కిలీమీటర్ల మార్గం భూగర్భంలో వెళ్తుంది.
కారిడార్ 5.. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి కోకాపేట్ నియోపోలిస్ వరకు బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ నియోపోలిస్ మీదుగా బ్లూ లైన్ ను పొడిగిస్తారు.
Also Read: ఆ ఎమ్మెల్యేల చేరికలు కాస్త లేట్ కావొచ్చు.. కానీ పక్కా, దానం సంచలన వ్యాఖ్యలు
కారిడార్ 6.. ఎంజీబీఎస్ నుండి చంద్రాయన్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగింపు.. ఎంజీబీఎస్ నుండి ఈ 7.5 కి.మీ లైన్, ఓల్డ్ సిటీలోని మండి రోడ్ మీదుగా దారుల్షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్నుమా మీదుగా ప్రయాణిస్తుంది. కారిడార్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ నుండి 500 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ పేర్లనే వాటి చారిత్రక ప్రాముఖ్యత కారణంగా స్టేషన్ పేర్లుగా చేర్చనున్నారు.
కారిడార్ 7.. ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపు.. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభించి, పటాన్చెరు వరకు ఉన్న ఈ 13.4 కిలీమీటర్ల లైన్ ఆల్విన్ X రోడ్, మదీనాగూడ, చందానగర్, బిహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది.
కారిడార్ 8.. విజయవాడ హైవేపై ఎల్ బి నగర్ వైపు నుండి రెడ్ లైన్ పొడిగింపు.. ఎల్ బి నగర్ నుండి హయత్ నగర్ వరకు ఈ 7.1 కిమీ కారిడార్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది పార్తిగా ఎలివేటెడ్ కారిడార్లో సుమారు 6 స్టేషన్లు ఉంటాయి.
సీఎం ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయమైన ఫీచర్లతో వినూత్న రీతిలో డిపిఆర్ తయారు చేస్తున్నామని చెప్పారు మెట్రో ఎండీ… ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన డీపీఆర్ లను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.