మెగా బ్రదర్ నాగేంద్రబాబు పెద్దల సభకు వెళ్లనున్నారా ? కూటమి పార్టీలు ఏం నిర్ణయం తీసుకున్నాయి ? ఇప్పటికే ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి ఎన్ని జనసేనకు ఎన్ని ? వైసీపీ నుంచి ఎంపీల రాజీనామా పర్వం కొనసాగనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది.
రాజ్యసభకు మెగా బ్రదర్
ఏపీ రాజ్యసభకు త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. ఏపీలో ఖాళీగా ఉన్న 3 స్థానాల్లో ఒకటి జనసేన, రెండు టీడీపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబుకు సీటు ఖరారైనట్లు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగబాబుకు అనకాపల్లి టిక్కెట్ అనుకున్నారు. పొత్తులో భాగంగా అది బీజేపీకి దక్కింది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలిగారు. ఈ క్రమంలోనే నాటి ఒప్పందంలో భాగంగా ఈ మెగా బిగ్ బ్రదర్ కు రాజ్యసభ ఖాయంగా సమాచారం.
చిరంజీవి తర్వాత నాగబాబే..
ఇదే జరిగితే మెగా ఫ్యామిలీ నుంచి రాజ్యసభకు వెళ్లిన రెండో సభ్యుడిగా నాగబాబు గుర్తింపు పొందనున్నారు. గతంలో చిరంజీవి రాజ్యసభ మెంబర్ గా కేంద్ర మంత్రిగా పనిచేయడం గమనార్హం.
ఎదురులేని కూటమి…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు దాటింది. 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన అలయెన్స్ దాదాపుగా 90 శాతంపైగా సీట్లను ఒడిసిపట్టింది. 164 స్థానాలను కైవసం చేసుకుని అప్పటి అధికార వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టింది.
మూడు సీట్లు కూటమికే…
ఇటీవలే కార్పోరేషన్ ఛైర్మన్లను నియమించిన కూటమి పెద్దలు, తాజాగా రాజ్యసభ సీట్ల పంపకాలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. వైసీపీ తరఫున ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా సమర్పించేశారు. అయితే ఆయా సీట్లు దక్కించుకునేందుకు కావాల్సిన సంఖ్య బలం వైసీపీ వద్ద లేదట. అసెంబ్లీలో ఉన్న సంఖ్య బలం ఆధారంగా ఈ మూడు స్థానాలు కూడా కూటమికే దక్కనున్నాయి. ఒకటి జనసేన, రెండు టీడీపీకి దక్కనున్నాయి.
Also Read : బీజేపీతో తాడో పేడో.. జగన్ సాహసం చేస్తున్నారా?
టీడీపీకి, జనసేనకు రాజ్యసభలో ఎవరు లేరు…
ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన పార్టీలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. ఆర్.క్రిష్ణయ్య, బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామాలతో కొత్త అభ్యర్థుల ఎంపిక కసరత్తులు చకచకా జరుగుతున్నాయి. అక్టోబర్ మూడో వారంలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
అభ్యర్థులు వీరేనా…
టీడీపీ నుంచి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తో పాటు సీనియర్ నేత అశోక్ గజపతి, మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్రలో ఒకరి సీట్ దక్కే అవకాశం ఉంది. నాలుగో స్థానం అందుబాటులోకి వస్తే ఎస్సీ క్యాటగిరికి ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్.