గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా అన్ని స్థానాల్లోనూ పాగా వేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 64 స్థానాల్లో జెండా ఎగరేసింది. కానీ గ్రేటర్ పరిధిలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది.
అయితే తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్లోకి రావాలనుకుంటున్న పింక్ ఎమ్మెల్యేలను తమపై హైకోర్టులో ఉన్న కేసును బూచిగా చూపించి బీఆర్ఎస్ పెద్దలు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
హైదరాబాద్లో ఆదివారం మీడియాతో చిట్ చాట్గా మాట్లాడిన దానం, కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక మాత్రం తప్పకుండా ఉంటుందన్నారు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలోని అగ్రనేతలు, బీజేపీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో హరీష్ రావు గౌరవప్రదంగా ఉండేవారని, ఇప్పుడు ఆయన కూడా గాడి తప్పారని దానం అంటున్నారు. తమను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్న అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.
జనాలకు ముందే చెప్పాల్సింది…
ఏదైనా భవనం కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు అర్థమయ్యేలా హైడ్రా వివరిస్తే బాగుండన్నారు. అలా చేస్తే ఇప్పుడు ఇంతలా ఇబ్బందులు ఎదురయ్యేవి కావని ఆయన అన్నారు. ఇక చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని, ఓ చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని ఎడ్చిన ఘటన తనకు బాధ కలిగించిదన్నారు. అప్పట్లో గులాబీ సర్కార్ ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరు కూడా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
నిజనిర్దారణకు కమిటీ కావాలి…
హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్దారణ కమిటీ వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తానన్నారు. ఇంకాస్త ముందే హైడ్రా స్పందించి ఉంటే, ప్రజల్లో ఇంతలా అభద్రతా భావం మొదలయ్యేదే కాదన్నారు.
Also Read : హైడ్రాపై బీఆర్ఎస్ హైడ్రామా చేస్తుందా?
అప్పట్లోనే విచ్చలవిడిగా పర్మిషన్లు…
అక్రమ కట్టడాలకు గత ప్రభుత్వమే విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చిందని దానం వెల్లడించారు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా కేటీఆర్ ఎందుకు చెప్పలేదని నిలదీశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మూసీలోని అక్రమకట్టడాలను కూల్చేస్తామని ప్రకటించారని, ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారా అని బీఆర్ఎస్ పార్టీని కడిగిపారేశారు. భవనాల కూల్చివేతలపై కాంగ్రెస్ పక్షాన ప్రజలకు విస్త్రృత స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు.
గరీబోళ్ల ఇళ్లను కూల్చితే కష్టం..
తన నియోజకవర్గంలో జలవిహార్, ఐమాక్స్ లాంటి ప్రదేశాల్లో పేదవాళ్ల ఇళ్లను మూసీ సుందరీకరణ పేరుతో కూల్చడం సరికాదన్నారు. మూసీ నిర్వాసితులకు మొదట కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఆ తర్వాతే ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాలన్నారు. ఇళ్లకు రెడ్మార్క్ చేయడం కచ్చితంగా తొందరపాటేనన్నారు. కూల్చిన ఇళ్లకు స్థానికంగానే నివాసాలు కల్పించేలా సీఎం దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు.