Nine Killed As Bus Collides With Truck In Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైహార్ జిల్లాలో ఓ బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారితోపాటు మహిళలు ఉన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే వాహనంలో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను మైహర్, అమర్పతన్, సత్నా జిల్లా ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. ప్రయాగ్ రాజ్ నుంచి రేవా మీదుగా నాగ్ పూర్ వెళ్తున్న ఓ బస్సు మైహార్లో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగంగా వెళ్తున్న బస్సు మైహార్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాదన్ దేహాత్ పోలీస్ స్టేషన్ సమీపంలో పక్కన ఆగి ఉన్న హైవా వాహనాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందింది. దీంతో నాదన్, మైహార్ పోలీసులు ఎస్డీఎం వికాస్ సింగ్, తహసీల్దార్ జితేంద్ర సింగ్ పటేల్, ఎస్పీ సుధీర్ కుమార్ అగర్వాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే బస్సులో ప్రయాణికులు చిక్కుకోవడంతో జేసీబీ, గ్యాస్ కట్టర్ సహాయంతో బస్సు డోర్ తొలగించి ప్రయాణికులు బయటకు తీశారు. ఇందులో 24 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. కొంతమంది ప్రయాణికులు కిటిలో నుంచి బయటకు దూకడంతో ప్రాణాలు దక్కినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.