టీపీసీసీకి కొత్త కమిటీలు వచ్చేస్తున్నాయోచ్
– త్వరలోనే టీపీసీసీ కొత్త కార్యవర్గం
– తర్వాత డీసీసీ అధ్యక్షల నియామకం
– స్థానిక ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం
– స్పష్టం చేసిన టీపీసీసీ చీఫ్
– మూసీ అంశంలో బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం
హైదరాబాద్, స్వేచ్ఛ : టీపీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన ప్రతీ విషయంలోనూ వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ కొత్త కార్యవర్గంపై ఆయన ఫోకస్ పెట్టారు. తర్వలోనే ఈ అంశంపై క్లారిటీ ఇస్తామని అంటున్నారు.
అనంతరం డీసీసీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుల ఎంపిక ఉంటుందని చెబుతున్నారు. శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన పలు అంశాలపై స్పందించారు. పీసీసీ కార్యవర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలను కలుస్తామని తెలిపారు.
కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్న ఆయన, అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో వారికి అన్యాయం జరిగిందన్నారు. డీసీసీ భాధ్యతలు ఎమ్మెల్యేలకు ఇవ్వాలనే ప్రతిపాదన ఉందని చెప్పారు.
బీఆర్ఎస్పై మండిపాటు…
మూసీ వ్యవహారంలో బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు మహేష్ గౌడ్. మల్లన్న సాగర్ భాధితుల కన్నీళ్లు ఇన్ని రోజులూ హరీష్ రావుకు కనిపించలేదా అని అడిగారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు తాము వెళ్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని గుర్తు చేశారు. హైడ్రా, మూసీ అభివృద్ధితో సామాన్యులకు కొంత ఇబ్బంది అయినా హైదరాబాద్ మొత్తానికి లాభం జరుగుతుందని వివరించారు.
Also read : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఆ స్థానం వారిదే అంటూ ప్రకటన
పీఈటీలతో భేటీ…
పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్ను త్వరగా పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు మహేష్ గౌడ్. గాంధీ భవన్లో గురుకుల పీఈటీలు ఆయన్ను కలిశారు. తమ సమస్యలను విన్నవించారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడతానని మహేష్ గౌడ్ హామీ వారికి తెలిపారు.