Karthi: ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పడం కష్టమనే చెప్పాలి. కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటే కొంతమందికి చెడ్డపేరు వస్తుంది. ఇంకొంతమందికి గుర్తింపు వస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తీకి ఒక వివాదం.. బాగా కలిసి వచ్చినట్టుంది. ఈ మధ్యకాలంలో కార్తీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెల్సిందే. తిరుపతి లడ్డూ వివాదంలో కార్తీ ఇరుకున్న విషయం కూడా విదితమే.
కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ మంజూష అడిగిన ఒక్క ప్రశ్న. కార్తీ లైఫ్ ను టర్న్ చేసింది. లడ్డూ కావాలా నాయనా అనే మీమ్ ను చూపించి.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా.. కార్తీ చాలా సింపుల్ గా నవ్వుతూ.. ” లడ్డూ గురించి ఇప్పుడు ఎందుకు లెండి.. అది సెన్సిటివ్ ఇష్యూ” అని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తరువాతి రోజు కార్తీ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
” లడ్డూపై కామెంట్స్ చేస్తున్నారు. జోక్స్ వేస్తున్నారు. నిన్న ఓ సినిమా ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని అన్నారు. దయచేసి అలా అనొద్దు. నటులుగా మీరంటే గౌరవం.. కానీ, సనాతన ధర్మ విషయం గురించి వచ్చినప్పుడు ఒక్క మాట మాట్లాడాలన్నా వందసార్లు ఆలోచించండి” అని పవన్ ఫైర్ అయ్యారు. ఇక దానికి కార్తీ పాజిటివ్ గా తీసుకున్నాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు కూడా తెలిపాడు,. ” అనుకోకుండా జరిగినదానికి క్షమించండి. నేను కూడా సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను” అని రాసుకొచ్చాడు.
ఇక చేయని తప్పుకు కార్తీ క్షమాపణ చెప్పినట్టు సోషల్ మీడియాలో హీరోకు జనాదరణ పెరిగింది, కార్తీ జస్ట్ నార్మల్ గా నవ్వుతూ చెప్పాడు కానీ, అపహాస్యం చేయలేదని, పవన్ కళ్యాణ్ చాలా ఓవర్ గా చేశాడని చెప్పుకొచ్చారు. కార్తీ సారీ చెప్పి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నాడని చెప్పుకొచ్చారు. ఇక దీంతో అతనిపై తెలుగు, తమిళ్ అభిమానులకు పాజిటివిటీ పెరిగింది. అంతేకాకుండా కార్తీ క్షమాపణ చెప్పడంతో వెంటనే పవన్ కూడా స్పందించి.. అతనిని ప్రశంసించాడు. అంతేనా.. కార్తీ నటించిన సత్యం సుందరం సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాడు. దీంతో సినిమాపై కూడా పాజిటివిటీ పెరిగింది.
దేవర సినిమాతో పోటీగా కార్తీ దిగాడు. సాధారణంగా అయితే అసలు కార్తీ సినిమా వచ్చిందా అనేది కూడా తెలిసేది కాదు. కానీ, ఈ కాంట్రవర్సీతో కార్తీ సినిమాపై హైప్ వచ్చింది. ఇక సినిమా కథ కూడా ప్రేక్షకులకు నచ్చడంతో సత్యం సుందరం హిట్ టాక్ అందుకుంది. ఇక దీంతో కార్తీ క్షమాపణ చెప్పి మంచి పనే చేశాడు అని మాట్లాడుకుంటున్నారు.
ఒకరకంగా ఇది కార్తీ స్ట్రాటజీ అని కూడా అనుకోవచ్చు. ఆ సమయంలో కార్తీ స్పందించకపోయినా.. పవన్ కు క్షమాపణ చెప్పకపోయినా.. ఇంత హైప్ అయితే వచ్చేది కాదేమో అని అనిపించక మానదు. ఇవన్నీ లేకపోయినా.. కథ నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఒకరు మౌత్ టాక్ మంచిగా ఉంటే.. అదే మిగతావారిని తీసుకువస్తుంది. సత్యం సుందరం కూడా అదే బాటలో నడుస్తుంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి కలక్షన్స్ అందిస్తుందో చూడాలి.