వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకస్మాత్తుగా తిరుమల పర్యటన రద్దు చేసుకుని ఝలక్ ఇచ్చారెందుకు. శుక్రవారం సాయంత్రం తిరుమలకు వెళ్లి శనివారం ఉదయం కలియుగ దైవం వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్తున్నట్లు ముందుగా ఖరారైన షెడ్యూలు ఎందుకు తారుమారైంది.
గతంలో ఎలాంటి డిక్లరేషన్ పై సంతకం చేయకుండానే దర్శనం చేసుకున్న జగన్, ఈసారి కూడా అలాగే సంతకం చేయబోరని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు అన్నారు ?
మరోవైపు జగన్ ను ఆలయంలోకి రానీయకుండా అధికారులు అడ్డుకుంటే భారీ ఎత్తున ఆందోళన చేపడతామని వైసీపీ నేతలు ఎందుకు అన్నారు. వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. వైఎస్ జగన్ తిరుమల టూర్.
పొలిటికల్ వార్ కు ఛాన్స్…
ఈనెల 27న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జగన్ కార్యాలయం నుంచి తిరుమల పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు అన్ని మీడియా సంస్థలకు సందేశం వచ్చింది. కానీ ఇందుకు కారణాన్ని మాత్రం అందులో వెల్లడించడలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్వయంగా జగన్, పాత్రికేయుల సమావేశంలో వివరిస్తారనే సమాచారం వచ్చింది. ఈ వార్త అటు రాజకీయ పార్టీలను, ఇటు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో జగన్ తప్పులో పడ్డారని, కూటమి పార్టీలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనలకు పొలిటికల్ వార్ కు అవకాశం ఇచ్చినట్టు అయ్యిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
సీన్ రివర్స్…
సీఎం చంద్రబాబు లడ్డూ వ్యవహారాన్ని బయటపెట్టిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆందోళన వాతావరణం నెలకొంది. ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం మీద నెట్టింట ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. దీంతో ఆ పార్టీ చీఫ్ జగన్ తిరుమల టూర్ కోసం ప్లాన్ చేసుకున్నారు. శనివారం రోజున వెంకన్నను దర్శించి ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టాలని ప్లాన్ వేశారట. కానీ సీన్ రివర్స్ అయ్యింది. డిక్లరేషన్ మీద సంతకం లేకుండా దర్శనం జరగదని ప్రభుత్వం చెప్పేసింది. టీటీడీ సైతం ఇదే నిర్ణయంతో ఉంది.
అందుకే టూర్ రద్దు…
కాదని బలవంతంగా వెళ్తే ఆలయ సాంప్రదాయాలను ఉల్లంఘిన పేరుతో అరెస్టుల దాకా పోతుందని, మరోవైపు డిక్లరేషన్ రాస్తే తాను శ్రీవారిని విశ్వసిస్తున్నట్లు చెప్పకనే చెప్పినట్లు అవుతుందని భావించారట. ప్రజల్లోకి మాత్రం పోలీసుల ఆంక్షల నేపథ్యంలోనే తిరుమల టూర్ రద్దు చేస్తున్నట్లు చెప్పారని ప్రజలు అంటున్నారు.
Also Read : కూటమి సర్కార్ని ప్రశ్నిస్తూ.. జగనన్నపై షర్మిల బాణాలు
రోడ్ షో కోసం రెఢీ కానీ…
కల్తీ లడ్డూ ఎపిసోడ్పై ప్రజలు ఆగ్రహంగా ఉన్న కారణంగా జగన్ తిరుపతిలో రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి పట్టణం వరకు భారీ రోడ్ షో చేయాలని తొలుత ప్లాన్ వేశారట. ఇందుకోసం భూమన, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఆర్కే రోజా లాంటి నేతలు జగన్ రోడ్ షోకు అన్నీ ఏర్పాట్లు చేశారట. పోలీసుల అనుమతి కోసం కూడా దరఖాస్తు చేశారట. ఇదే జరిగితే జగన్కు పొలిటికల్ మైలేజీ, మీడియా కవరేజీ బాగా వచ్చేది.
కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. కానీ పోలీస్ యాక్ట్ 30ని అమల్లోకి తీసుకువచ్చారు. దీంతో జగన్ పాచికలు పారలేదని నెటిజన్లు అంటున్నారు. తిరుపతిలో ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు జరపకూడదని పోలీసుల ఆదేశాలున్నాయి. దీంతో జిల్లాలోని కీలక వైసీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేసి ర్యాలీలు, ఊరేగింపులు చేయవద్దని నోటీసులు ఇచ్చేశారు.
Also Read : జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?
లా అండ్ ఆర్డర్ ఇష్యూ…
మరోవైపు బీజేపీతో పాటు ఇతర హిందూ సంస్థలు కౌంటర్ ర్యాలీకి ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇరు పక్షాల ర్యాలీలు గనక జరిగి ఉంటే అది శాంతిభద్రతల సమస్యకు దారి తీసేది. జగన్ ఒంటరిగా తిరుమలకు వెళ్లకుండా ఊరేగింపుగా వెళ్లాలనుకుంటే మాత్రం ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని టాక్. దీంతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకోవడానికే మొగ్గు చూపారట.