Kaleswaram Commission: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రాజెక్ట్ ను సందర్శించిన కమిషన్ విచారణ పర్వాన్ని వేగవంతం చేసింది. అందులో భాగంగా తెలంగాణ ENC నల్ల వెంకటేష్ ను విచారించిన కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటు అంశంలో భాగంగా ఆనకట్ట నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది.
ఈ సందర్భంగా ENC నల్ల వెంకటేష్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ కి తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిషన్ ఈ సంధర్భంగా హెచ్చరించింది. అలాగే ఫాల్స్ ఆధారాలు ఇస్తే సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సికెంట్ పైల్స్ CE CDO సజెస్ట్ చేసిందన్న వ్యాఖ్యలకు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఈ సీడీవో డిజైన్స్ అండ్ డ్రాయింగ్ మాత్రమే ఇస్తుంది… మిగతా విషయాల్లో సీఈ సీడీవో ఎలా కలగజేసుకుంటుందని ప్రశ్నించగా.. ENC నల్ల వెంకటేష్ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఉండి పోయారు. సికెంట్ ఫైల్స్ సజెషన్ చేసినట్లు డాక్యుమెంట్ ఆధారాలు కమిషన్ కు ఇస్తారా అని నల్ల వెంకటేష్ ను కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. మీ ఇష్టం వచ్చినట్లు కమిషన్ ముందు సమాధానాలు చెప్తే మేము నమ్మాలా అన్న కమిషన్.. నీకు కన్ఫ్యూజన్ ఉంటే నీ దగ్గరే పెట్టుకో నా వరకు తీసుకురాకు అంటూ అసహనం వ్యక్తం చేసింది. విచారణను మధ్యలోనే ఆపివేసి మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి.. విచారణ ఇంకా పూర్తి కాలేదు.. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కమిషన్ తెలిపింది.
Also Read: Kavitha Missing: కవిత కనబడుటలేదు.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు
దీనితో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలకు ఊతమిచ్చేలా అధికారుల సమాధానాలు ఉంటుండగా.. కమిషన్ కొంత అసహనానికి లోనైంది. మొత్తం మీద విచారణ వేగవంతం చేసిన కమిషన్ దెబ్బకు.. అవినీతికి పాల్పడ్డ అధికారుల్లో వణుకు పుట్టిందనే చెప్పవచ్చు. ఇంకా మరికొందరు అధికారులను కమిషన్ విచారించనుంది. మున్ముందు కమిషన్ ముందు హాజరయ్యే అధికారులు పక్కా సమాచారం ఇచ్చేలా.. ENC నల్ల వెంకటేష్ పై కమిషన్ ఆగ్రహం తెలిపింది.