తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు గడిచిపోయింది. 2014లో తొలిసారి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, వరుసగా రెండోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ లెక్కన దాదాపుగా తొమ్మిదిన్నరేళ్లు పరిపాలన చేసింది.
ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ మహానగరానికి ఏం చేశారు. ఏం చేయాల్సి ఉండే. ఇంకేం మర్చిపోయారని ఆలోచిస్తే చాలా అంశాలే కనిపిస్తాయి. గ్రేటర్ వాసుల కోసం ఎస్ఆర్డీపీ నిధుల సహకారంతో నగరంలో చాలా చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించారు. అంత వరకు బాగానే ఉన్నా కీలకమైన వరద ముంపు సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారని గ్రేటర్ వాసులు భావిస్తున్నారు.
రమారమి పదేళ్ల అధికార కాలంలో గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలను పరిరక్షించి ఉంటే అక్రమ నిర్మాణాలు వెలిసేటివే కాదంటున్నారు. నాలాలు కబ్జాకు గురయ్యేవేకావట. వర్షాలు పడ్డప్పుడు ఇబ్బడిముబ్బడిగా వరద ఇళ్లలోకి చేరి ప్రజలు బెంబెలెత్తిపోయేవాళ్లే కాదని సెలవిస్తున్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలు ఆగం…
నాగార్జున లాంటి అగ్ర సినీ హీరో, బడా వ్యాపారవేత్త ఏకంగా చెరువునే కబ్జా చేసి ఏకంగా లగ్జరీ ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారని, దాదాపు 10 ఏళ్లు కేసీఆర్ హయాంలో ఆయనకు ఎదురే లేకుండా పోయిందని ట్రోల్ చేస్తున్నారు. కానీ చెరువుల ఆక్రమణ వల్ల వర్షం నీరు ఎటు వెళ్లాలో తెలియక పేద, మధ్యతరగతి వాళ్లు ఉండే కాలనీల్లోకే ఎక్కువగా చేరిపోయేదని, బడా బాబులు మాత్ర దర్జాగా సేఫ్ జోన్ లో ఉండేవాళ్లని నెట్టింట చర్చిస్తున్నారు.
కాంగ్రెస్ నేత కట్టడం కూల్చివేత…
పైగా మహానగర వ్యాప్తంగా రోడ్ల మీద వరదలు పొంగి ప్రవహించి ప్రజలు నానా అవస్థలు పడేవాళ్లని, ఈ దుస్థితిని గమనిస్తూ వచ్చిన అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సీఎం కాగానే దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడం సంతోషకరంగా ఉందంటున్నారు. అంతేకాదు అక్రమార్కులు ఎంతటివారైనా సరే, ఎట్టిపరిస్థితుల్లోనూ మినహాయింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచి నిర్ణయమంటున్నారు. దీన్ని సాధారణ ప్రజలుగా తాము ఆహ్వానిస్తున్నామంటున్నారు. మరోవైపు ప్రభుత్వం తన చిత్తశుద్ధుని నిరూపించుకునేందుకు ఉదాహారణగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుకు చెందిన కట్టడాన్ని నేలమట్టం చేశారు.
గులాబీలది మాస్టర్ మైండ్ అట…
ఇక హైడ్రా కూల్చివేతలను పెద్దదిగా చూపిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోందని ప్రజల్లోకి మేసేజ్ వెళ్తోంది. రాజకీయ పార్టీగా మాట్లాడేందుకు అన్ని అంశాలు పాతగా అయిపోయాయి కాబట్టి హైడ్రాతోనే పబ్బం గడిపేద్దాం అని బీఆర్ఎస్ స్ట్రాటజీ మార్చినట్లు జనం గమనిస్తున్నారట.
Also Read : కవిత కనబడుటలేదు.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు
హైదరాబాద్ ఓ లేక్ సిటీ…
ఇంకోవైపు హైదరాబాద్ ఓ ప్రపంచ స్థాయి మహానగరంగా పేరుగాంచింది. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ గ్రేటర్ సిటీ భవిష్యత్ కోసం ప్రజా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. చెరువులు, నదీ తీరాల ఆక్రమణల తొలగింపు ధ్యేయంగా పని చేస్తున్న కాంగ్రెస్ సర్కారును విమర్శించేందుకు ఏదీ దొరక్క హైడ్రాను పట్టుకోవాలని గులాబీలు చూస్తున్నారని టాక్. ఓ వైపు నిర్వాసితులకు ఆశ్రయం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెబుతున్నా సరే ఆయా బాధితులతో గులాబీ నేతలు రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని నెటిజన్లు అంటున్నారు.
అయితే హైడ్రా మాత్రం పెద్ద చిన్నా, లేనివాళ్లు ఉన్నవాళ్లు అన్నబేధం లేకుండా ఎఫ్.టీ.ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన ఏదైనా సరే కూల్చివేసేందుకే హైడ్రా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కీలక నేతలు హైడ్రాపై బురదచల్లేందుకే ఒడిగడుతున్నారు.
Also Read : కాంగ్రెస్ పనైపోయింది!.. బండి సంజయ్ కామెంట్స్
సిటీలో 28 వేల ఇళ్లు అక్కడే…
హైదరాబాద్ను కాపాడేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తుంటే మాజీ మంత్రి హరీష్రావు హైడ్రా ప్లాన్ ను తప్పుపట్టడంపై జనం తిట్టుకుంటున్నారట. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో హైడ్రా గురించి మాట్లాడారని, సిటీలో నాలాలపై 28 వేల ఇళ్ల నిర్మాణాలు ఉన్నట్లు చెప్పడాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడే కేసీఆర్ ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు హైడ్రా అవసరం రాకపోయేది కదా అని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత లేక్ సిటీగా ఉన్న నగరాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించారని, ఏటా హైదరాబాద్ వరదల్లో మునిగిపోతుండేదని, హైడ్రాతో ఈ సమస్యకు పూర్తిగా చెక్ పెడితే బాగుంటుందని గ్రేటర్ సిటిజన్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.