– హైడ్రాతో తలగోక్కుంటోంది
– హిందూవుల ఇళ్లే ఎందుకు కూల్చుతున్నారు?
– ఒవైసీ అనుచరుల కబ్జాల సంగతేంటి?
– పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదు
– మూసీ సుందరీకరణ పెద్ద బోగస్
– బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay Sensational Comments on Congress Party : మూసీ నిర్వాసితుల తరలింపు, ఇతర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బండ్లగూడ జాగీర్లో సరస్వతి శిశుమందిర్ పాఠశాల అదనపు గదుల ప్రారంభోత్సవం, పాద పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఎనిమిది నెలల్లో విధ్వంసం జరిగిందని, స్వయంగా పాట పాడి వినిపించారు. కాంగ్రెస్ పనైపోయిందని, గ్యారెంటీల అమలు, మాజీ సర్పంచుల బిల్లుల అంశాలు ఆపార్టీకి కొరివి పెట్టబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందూవుల ఇళ్లే ఎందుకు?
హైడ్రాకు బీజేపీ వ్యతిరేకం కాదన్న సంజయ్, ప్రభుత్వ నిర్ణయం వల్ల పేదలు రోడ్డున పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలన్నీ హిందువులవేనని, ముస్లింలకు సంబంధించిన ఏ ఒక్క బిల్డింగ్ కూల్చలేదన్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ కొరివితో తల గోక్కుంటోందని అన్నారు. మలక్ పేట రేస్ కోర్సు నుంచి మూసారాంబాగ్ వరకు మూసీ స్థలాలను ఒవైసీ బ్యాచ్ కబ్జా పెట్టిందని, దమ్ముంటే వాటిని టచ్ చేయాలని ఛాలెంజ్ చేశారు. రజాకార్ల ముఠా పార్టీ ఎంఐఎం ఉన్నంతవరకు పాతబస్తీ మారదన్నారు. ఓ వర్గం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తూ ఒవైసీకి సాగిలపడుతున్నాయని విమర్శించారు.
Also Read: కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారిలా? మూసీ ప్రక్షాళనపై ‘మురుగు’ రాజకీయాలు, అసలు సంగతి ఇది
మూసీ పేరుతో డ్రామా
మూసీ వల్ల పేద ప్రజలకు తీరని అన్యాయం జరగనుందని తెలిపారు బండి. సుందరీకరణ పేరుతో డ్రామా చేస్తున్నారని, గత 30 ఏళ్ల నుంచి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నామని మండిపడ్డారు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్లలా మారుస్తామని మాయమాటలు చెప్పారని అన్నారు. ఫాంహౌస్లో పడుకుని ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు. జీతాలు ఇవ్వడానికి, రుణమాఫీ, ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవు గానీ, మూసీ సుందరీకరణకు లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం అంటూ కేసీఆర్ దోపిడీ చేస్తే, మూసీ ప్రక్షాళన అంటూ కాంగ్రెస్ అదే దారిలో వెళ్తోందని విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా డౌన్ అవుతుందన్న బండి, బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణ మరో శ్రీలంకగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.