ఏపీలో దాదాపుగా ఒంటరి పోరాటం చేస్తున్న వైసీపీకి ఇపుడు అంతా ప్రతికూల వాతావరణమే కనిపిస్తోంది. అక్రమాస్తులు కేసు, వైఎస్ వివేకా హత్య కేసు, అయిదేళ్ల పాలనలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న ఆరోపణల . తిరుమల లడ్డూ వివాదం. ఇలా దాదాపు అష్ట దిగ్భంధనంలో చిక్కుకున్న వైసీపీ అధ్యక్షుడు విలవిల్లాడుతున్నారు. ఏ ఒక్క పార్టీ వైసీపీకి అండగా నిలబడటం లేదు. సొంత పార్టీ వారే జగన్పై నమ్మకం లేక పార్టీ వదిలిపోతున్నారు. ఆ క్రమంలో ప్రతిపక్షహోదా కూడా దక్కకుండా 11 స్థానాలకు పరిమితమైన జగన్ పార్టీకి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది.
వరుసగా వెలుగు చూస్తున్న అరాచకాలతో వైసీపీ ప్రతిష్ట నానాటికి దిగజారిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2014 -19 మధ్యకాలంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇప్పటి సీఎంకి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పట్లో ఆయన జగన్ ని లైట్ తీసుకున్నారు. ..జగన్ సీఎంగా ఉన్నప్పుడు నడిపిన కక్షపూరిత రాజకీయాలను అపర చాణక్యుడిగా పేరున్న ఆయన మర్చిపోలేక పోతున్నారంటున్నారు. జగన్ ని ఏ విధంగానూ రాజకీయంగా లేవనీయకూడదు అని ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే నిర్ణయించుకున్నారంట.
దానికి అనుగుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. వివిధ రంగాల శ్వేత పత్రాల రిలీజ్ చేసి గత ప్రభుత్వ అప్పుల లెక్కలు తేల్చారు. సమాజంలోని వివిధ వర్గాల్లో వైసీపీ మీద సానుభూతి పోయే విధంగా చేస్తున్నారు. ఏపీని సర్వ నాశనం చేసిన భూతం జగన్ అంటున్నారు ఆయన రాజకీయంగా ఉండకూడదు అని ఓపెన్ గానే చెబుతున్నారు. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వివాదం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంత కాలం ఒంటరి పోరాటం చేయగలదన్న చర్చ మొదలైంది.
Also Read: జగన్ ను ఆడేసుకున్న హోంమంత్రి అనిత… నాలాగా నువ్వు చెప్పగలవా ?
వైసీపీకి మద్దతుగా నిలిచే పార్టీలు ఏ ఒక్కటీ లేవు. ఆఖరికి సీపీఐ నేత నారాయణ కూడా అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని టార్గెట్ చేస్తూ.. ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే ఒక్క సీపీఎం మాత్రమే వైసీకీకి కాస్త ఊరటనిస్తున్నట్లు కనిపిస్తుంది. లడ్డూ వివాదంతో సీపీఎం కూటమి నేతల మీద ఫైర్ అవుతోంది. తప్పు జరిగితే విచారణ జరిపించాలని దానిని రాజకీయంగా వాడుకోవడమేంటి అని విమర్శిస్తోంది. లడ్డూల పేరుతో రాజకీయ సరికాదు అని సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు అన్నారు. విజయవాడలోని ఏచూరి సీతారాం సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కల్తీ జరిగినట్లుగా రుజువు అయితే బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆ అంశాన్ని కులం మతం వంటి వాటికి ఆపాదించి లౌకిక తత్వాన్ని దెబ్బతీయకూడదని రాఘవులు వ్యాఖ్యానించారు. రాఘవులు వ్యాఖ్యలు వైసీపీకి కష్టకాలంలో ఒకింత ఊరట నిచ్చాయంటున్నారు. వైసీపీ నేతలు కూటముల సంగతి పక్కన పెట్టి ఏపీలో పోరాటాలు గట్టిగా చేయాలి అంటే కమ్యూనిస్టులతో కలసి ముందుకు పోవాలని గద్దె దిగినప్పటి నుంచి జగన్కు చెప్తున్నారంట. గతం ఎలా ఉన్నా ఇపుడు జగన్కు కూడా వాస్తవాలు బోధపడుతున్నాయంట. హిందూ సెంటిమెంట్ తమకు వ్యతిరేకంగా మారుతుండటంతో.. ఏపీలో లౌకిక వాదాన్ని గట్టిగా వినిపించే సీపీఎంతో కలిసి నడిస్తే కాస్తైనా కలిసివస్తుందని వైసీపీ నేతల అభిప్రాయపడుతున్నారు. కామ్రేడ్స్తో కలిస్తే భవిష్యత్తులో ఇండియా కూటమిలో చేరడానికి కూడా అవకాశాలు మెరుగవుతాయంటున్నారు. మరి ఎవరి సలహాలూ స్వీకరించని జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.