ఒకరి పంతం.. మరొకరి అంతం వైపు దూసుకెళ్తోంది. హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా ఎక్కడ నక్కినా.. వెతికి, వెంటాడి మరి మట్టుబెడుతోంది. మొన్నటి వరకు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య నడిచిన మారణకాండ ఇప్పుడు హిజ్బుల్లా కోసం లెబనాన్ పై వైపు టర్న్ తీసుకుంది. ఈ యుద్ధం చూస్తుంటే మరో ప్రపంచ యుద్ధం తప్పదనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఊచకోతకు వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మొత్తంగా ఓ దేశమే గాల్లో దీపంలా మారింది.
ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన హమాస్-ఇజ్రాయెల్ పోరు.. ఇప్పుడు లెబనాన్ వైపుకు విస్తరించింది. ఇటీవల పేజర్లతో స్టార్ అయిన వార్ వాకీటాకీల పేలుళ్లతో సంచలనం సృష్టించింది. శుక్రవారం హెజ్ బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇక గత అర్థరాత్రి కూడా మరణహోమం కంటిన్యూ అయింది. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకరణ స్థాయిలో విరుచుకుపడింది. టైర్, జహరానితో బైకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 4 వందల మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో చిన్నారులు మహిళలు, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. అంతేకాదు 1500 మందికిపైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read: లెబనాన్ రాజధాని బీరుట్పై బాంబుల వర్షం.. వంతెనల కిందే ఆకలి బతుకులు
ఒకప్పుడు బీరుట్ సిటీ.. పారిస్ సిటీలా ప్రపంచంలోని అత్యంత సంపన్న పర్యాటకులను ఆకర్షించే ప్రదేశంగా ఉండేది. లెబనాన్లోనే కనిపించే ప్రత్యేకమైన స్విమ్సూట్లు, బీచ్లు.. సందడిగా ఉండే వీధులు, స్వేచ్ఛగా తిరిగే వ్యక్తులు. బహుశా, బీరుట్లో మహిళలకు ఉన్నంత స్వేచ్ఛ మిడిల్ ఈస్ట్ దేశాల్లో మరెక్కడా ఉండదంటే నమ్మలేదు. అలాంటి, దేశం ఇప్పుడు రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో అట్టుడికి పోతోంది. కళ తప్పి, పీడ కలలా మారింది. అయితే, ‘పారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్’గా పిలిచే బీరుట్ సిటీలో ఆశ్చర్యం కలిగించే కొన్ని లక్షణాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. లెబనాన్ ఎలాంటి దేశమంటే.. ప్రస్తుతం, అక్కడ తీవ్రమైన హింస, రక్తపాతం జరుగుతున్నప్పటికీ.. బాంబులు ఆగిపోగానే పార్టీ మొదలయ్యే పరిస్థితులు ఆ దేశానికే సొంతం అంటుంటారు.
లెబనాన్లో రాడికల్ గ్రూపుగా ఏర్పడి, రాజకీయంగా ఎదిగిన హిజ్బుల్లా రాకతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు హిజ్బుల్లా సభ్యులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఈ యుద్ధంలో సెప్టెంబర్ 23న లెబనాన్లో 492 మంది మరణించారు. వేల మంది గాయాలపాలయ్యారు. నిజానికి, లెబనాన్ సరిహద్దు దాడుల్లో ఇది అత్యంత ఘోరమైన రోజు. దీనికి కారణం, ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజాలో జరుగుతున్న యుద్ధం. హమాస్కు సహాయం చేస్తూ.. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా టెర్రర్ గ్రూప్, ఉత్తర ఇజ్రాయెల్పై 200 రాకెట్లను పేల్చడంతో లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. దీనికి ముందు, గత 11 నెలల్లో, హిజ్బుల్లా ఇజ్రాయెల్పై 8 వేల రాకెట్లను ప్రయోగించింది. వీటన్నింటికీ ప్రతీకారంగా, లెబనాన్లోని హిజ్బుల్లా సభ్యులు వాడే వేల కొద్దీ పేజర్లను ఇజ్రాయెల్ ఒకేసారి పేల్చింది. లెబనాన్ అంతర్జాతీయంగా బ్రేకింగ్ న్యూస్లో నిలిచింది. అప్పటి నుండీ లెబనాన్లో దాడులు ఆగలేదు. లెబనాన్లో ఇంత భారీ విధ్వంసం తర్వాత కూడా… బాబులతో కాలుతున్న భవనాల పక్కనే స్విమ్సూట్లలో మహిళలు, బీచ్లో రిలాక్స్ అవుతున్న వ్యక్తులు, క్లబ్బుల్లో పార్టీలు చేసుకునే ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.