NASA Will Launch Crew-9 Today: భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారిని భూమి మీదకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా చేస్తున్న ప్రయత్నాలు అన్నీ, ఇన్నీ కావు. నాసా, స్పేస్ ఎక్స్ లు గత కొంత కాలంగా వారిని భూమి మీదికి తెచ్చేందుకు పలు ప్రయోగాలకు శ్రీకారం చుట్టాయి. అయితే నాసా ఈనెల 26న క్రూ-9 మిషన్ ద్వారా వారిని తీసుకువచ్చే ప్రణాళికను సిద్దం చేసుకున్నాయి. చివరకు అమెరికాలో ప్రతికూల వాతావరణం కారణంగా నాసా, స్పేస్ ఎక్స్ తమ ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి, భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 10:47 గంటలకు స్పేస్-X సహాయంతో క్రూ-9 మిషన్ను ప్రయోగించనున్నట్లు నాసా అధికారికంగా తెలిపింది.
ఈ మిషన్ ద్వారానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి భూమి మీదకు తీసుకురానున్నారు. అంతరిక్ష కేంద్రానికి బోయింగ్ స్టార్లైనర్ ద్వారా వెళ్లిన ఆ ఇద్దరు వ్యోమగాములు అందులో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. కాగా అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్ తన పుట్టినరోజును సైతం జరుపుకున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ క్షేమంగా భూమి మీదికి రావాలని ప్రపంచ వ్యాప్తంగా కోరుకుంటుండగా.. భారత్ లో ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు. ఇక క్రూ-9 మిషన్ లక్ష్యం అంతరిక్షంలో ఉండిపోయిన వారిని భూమి మీదికి తీసుకురావడమే.
క్రూ-9 మిషన్ ను నాసా.. కేప్ కెనావెరల్ ప్రాంతంలో ప్రారంభించనుంది. అయితే ఇక్కడ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నాసా, స్పేస్ ఎక్స్ తో పాటు యూఎస్ స్పేస్ ఫోర్స్ 45 వెదర్ స్క్వాడ్రన్ కలిసి ఈ తుఫాన్ పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. ఈ మిషన్ కోసం కమాండర్ నాసా నిక్ హేగ్, మిషన్ స్పెషలిస్ట్ రోస్కోస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ లు 6 నెలల పాటు అంతరిక్షానికి వెళ్తారు. సాధారణంగా నాసా ప్రయోగించే ఏ మిషన్ లో నైనా నలుగురు వ్యోమగాములు వెళ్తారు. కానీ ఇప్పుడు క్రూ-9 మిషన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఇద్దరు వ్యోమగాములు మాత్రమే వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. వచ్చే ఏడాది మిషన్ పూర్తి చేసిన సమయంలో మిగిలిన రెండు సీట్లలో విలియమ్స్, విల్మోర్ లు కూర్చొని భూమి మీదకు రానున్నారు.
ఇలా క్రూ-9 మిషన్ నేడు ప్రయోగించనుండగా.. స్పేస్ అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమైంది. కాగా ఎటువంటి అవాంతరాలు లేకుండా మిషన్ సక్సెస్ కావాలని, అలాగే అంతరిక్షంలో ఇరుక్కున్న వ్యోమగాములు క్షేమంగా భూమి మీదికి రావాలని సహచర వ్యోమగాములు, శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. నాసా ఈ మిషన్ ఎలాగైనా విజయవంతంగా పూర్తి చేసేలా కృషి చేస్తోంది. ఇది ఇలా ఉంటే భారత్ లో సైతం వ్యోమగాములను తీసుకు వచ్చేందుకు ప్రయోగిస్తున్న క్రూ-9 మిషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.