Congress: కాంగ్రెస్ మారదు. కాంగ్రెస్ ను ఎవరూ మార్చలేరు. అంతర్గత స్వేచ్ఛ మరీ ఎక్కువ. ఓవైపు గాంధీభవన్ లోపల దిగ్విజయ్ సింగ్ శాంతి చర్చలు జరుపుతుంటే.. గాంధీభవన్ బయట కాంగ్రెస్ నేతలు కొట్టుకునే వరకూ వచ్చారు. కొందరు నేతలు గల్లాలు పట్టుకున్నారు. మాటలకు మాట తిట్టుకున్నారు. జై కాంగ్రెస్.. సేవ్ కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు.
మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టార్గెటెడ్ గా ఓయూ విద్యార్థి నేతలు విరుచుకుపడ్డారు. ఆయన రాజకీయ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారంటూ నిలదీశారు. పరుష పదుజాలంతో దూషించారు. తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది.
పరిస్థితి తీవ్రం కావడంతో.. సీనియర్ నేత మల్లు రవి అక్కడికి వచ్చారు. గొడవ పడుతున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. గొడవ వద్దంటూ.. దండం పెడతా ఆపమంటూ.. విద్యార్థి నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ పరువు తీయొద్దంటూ వేడుకున్నారు. మల్లు రవి విన్నపంతో ఓయూ విద్యార్థి నేతలు వెనక్కి తగ్గారు.
అంతా పక్కా ప్లాన్డ్ గా జరిగినట్టు కనిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్లపై, మరీ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఉత్తమ్ టికెట్లు అమ్ముకున్నారని.. కోవర్టు అని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనిల్ తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే అలాంటి విమర్శలు చేయించారనేది సీనియర్ల అనుమానం. కట్ చేస్తే.. దిగ్విజయ్ సింగ్ వచ్చిన సందర్భంగా గాంధీభవన్ దగ్గర అనిల్ ను కొందరు ఓయూ స్టూడెంట్స్ లీడర్స్ అడ్డుకున్నారు. సీనియర్లపై అభాండాలు ఎలా వేస్తారంటూ గట్టిగా నిలదీశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట, కొట్లాట జరగ్గా.. కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి.