Book My Show black Tickets| సినిమా, మ్యూజిక్ షోల టికెట్లు విక్రయించే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ‘బుక్ మై షో’ ఇటీవల బ్లాక్ లో టికెట్లు విక్రయించిందనే ఆరోపణలతో చిక్కుల్లో పడింది. బుక్ మై షో సిఈవో, వ్యవస్థాపకుడు ఆశీష్ హేమరజనీ కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. మరో నాలుగు నెలల్లో ముంబై నగరంలో జరగబోతున్న ఒక ప్రముఖ మ్యూజిక్ ఈవెంట్ కు సంబంధించని టెకెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అందులో భాగంగానే కంపెనీ సీఈవోకు విచారణ హాజరుకావాలని శుక్రవారం సమస్లు జారీ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ప్లే పేరుతో ఫేమస్ అయిన ప్రముఖ బ్రిటీష్ రాక్ బ్యాండ్ జనవరి 2025లో ముంబైలో ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్ షో చేయబోతోంది. ఈ షో చూడడానికి దేశం నలుమూలల నుంచి అభిమానులు తరలివస్తారు. కోల్డ్ప్లే మ్యూజిక్ షో కు విపరీతంగా డిమాండ్ ఉండడంతో ‘బుక్ మై షో’ లో సెప్టెంబర్ 22న దాని టికెట్ల బుకింగ్ ప్రారంభించారు. బుకింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే అన్ని టికెట్లు అయిపోయాయి. ఈ షోకు ఒక్కో టికెట్ ధర రూ.2500 కాగా ఆ టికెట్లన్నీ బల్క్ లో అమ్ముడుపోయాయి.
అయితే కోల్డ్ ప్లే మ్యూజిక్ షో టికెట్లు ఆన్ లైన్ లో అయిపోయినప్పటికీ బ్లాక్ లో విక్రయాలు జరుగుతున్నాయని.. ఒక్కో టికెట్ రూ.3 లక్షల కు అమ్ముతున్నారని ఆరోపణలు వచ్చాయి. ముంబైకి అమిత్ వ్యాస్ అనే లాయర్ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు.
Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి
కోల్డ్ ప్లే మ్యూజిక్ షో ప్రొగ్రామ్ జనవరి 19 నుంచి జనవరి 21 వరకు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగనుందని.. ఆ షో టికెట్లు బుక్ మై షో చట్టవ్యతిరేకంగా బల్క్ లో విక్రయించేసి.. ఇప్పుడు బ్లాక్ లో లక్షల ధరకు విక్రయిస్తోందని ఆరోపించారు. కోల్డ్ ప్లే అభిమానులు ఎంతో ఆత్రుత ఆ షో వెళ్లేందుకు ఎదురుచూస్తుండగా వారికి అన్యాయం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ముంబై పోలీస్ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది.
ఈ వ్యవహారంలో చాలా మంది బ్రోకర్లు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బుక్ మై షో యజమాన్యం ఈ బ్రోకర్లతో కుమ్మక్కై బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్నట్లు విచారణ చేస్తున్నామని.. అందులో భాగంగానే బుక్ మై షో సిఈఓ ని ప్రశ్నించడానికి సమన్లు జారీ చేశామని పోలీసులు తెలిపారు.
బుక్ మై షో వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా మారింది. అధికార కూటమిలోని బిజేపీ ప్రతినిధి రామ్ కదమ్ మాట్లాడుతూ.. ఈ బ్లాక్ టికెట్లు విక్రయించే వారందరూ జైలుకు వెళ్లాల్సిందేనని, రాష్ట్రంలో బ్లాక్ మార్కెటింగ్ జరగనిచ్చేది లేదని అన్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన ప్రతినిధి ఆనంద్ దూబే మాట్లాడుతూ ఇది బ్లాక్ మార్కెటింగ్ మాఫియా అని, మ్యూజిక్ బ్యాండ్ అభిమానుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసేందుకు ఈ మాఫియా ప్రయత్నిస్తోందని చెబుతూ.. దీని గురించి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్ ఒక లేఖ రాసినట్లు తెలిపారు.
భారతదేశంలో కోల్డ్ ఫ్లే మ్యూజిక్ రాక్ బ్యాండ్ కు విపరీతంగా అభిమానులున్నారు. ఈ బ్యాండ్ 8 ఏళ్ల తరువాత ఇండియాలో షో చేయబోతోంది. సెప్టెంబర్ 22న బుక్ మై షో లో టికెట్ల బుకింగ్ ప్రారంభమైనప్పుడు బుక్ మై షో వెబ్ సైట్, యాప్ క్రాష్ అయిపోయింది.