Corona: ఒమిక్రాన్ బీఎఫ్.7. కొత్త వేరియంట్. విస్తృంతగా వ్యాపించే సత్తా. వ్యాక్సిన్ వేసుకున్నా ప్రభావం చూపించే వైరస్. అందుకే, కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ అయింది. దేశంలో ఉన్నవి 4 కేసులే అయినా.. ఆరోగ్యశాఖ ఎంతగానో కంగారు పడుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. ప్రమాదమని హెచ్చరిస్తోంది. అందుకే కొత్త వేరియంట్ పై అన్నిరాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వాడటం తప్పనిసరి చేసింది కేంద్రం. ఆ మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు.
రాబోయే పండుగ సీజన్, న్యూ ఇయర్ సందర్భంగా అలర్ట్ గా ఉండాలని.. మాస్కులు, శానిటైజర్ల వాడకంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని.. భౌతికదూరం పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. ప్రికాషన్ డోసుల కవరేజీ పెంచాలన్నారు. ప్రతి కొవిడ్ కేసును జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని సూచించారు. ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ చేపడుతున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. జులై-నవంబర్ మధ్య కాలంలో దేశంలో బీఎఫ్ 7 వేరియంట్ కి చెందిన 4 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
రాజ్యసభకు హాజరైన ప్రధాని మోదీ మాస్కు ధరించి సభకు రావడం ఆసక్తికరం. లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్తో పాటు పార్లమెంట్ సభ్యులంతా మాస్కులు ధరించి సభకు వచ్చారు. మాస్కులు వాడేలా దేశ ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చారు.