Lokayukta police file FIR against Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది.
వివరాల ప్రకారం.. ముడా స్థలం కేటాయింపుల కేసు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గట్టిగానే చుట్టుకుంటోంది. కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదే చేశారు. కాగా, సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్కు గవర్నర్ ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై హైకోర్టు సైతం సమర్థించడంతో లోకాయుక్త తన విచారణను ప్రారంభించింది. సీఎం భార్య పార్వతికి ముడాలో రూ.56కోట్ల విలువైన 14 స్థలాలను కేటాయించడంతో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశారు.
ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన మైసూరులోని ప్రత్యేక కోర్టుల దీనిపై సమగ్ర విచారణ జరపాలని లోకాయుక్తను ఆదేశించింది. ఈ ప్రత్యేక కోర్టు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారిస్తుంది.
Also Read: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు
సాధారణ పరిస్థితులలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం.. మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అసాధారణ పరిస్థితులలో గవర్నర్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చని, ప్రస్తుత కేసు అలాంటి మినహాయింపును సూచిస్తోందని జస్టిస్ ఎం. నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సెప్టెంబర్ 24న తీర్పు వెలువరించింది.