Ex Mines director Venkat Reddy: వైసీపీలో టాప్ నేతలకు వణుకు మొదలైందా? గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి అరెస్టుతో వైసీపీ పాపం పండినట్టేనా? గనుల శాఖ దోపిడీలో అరడజను మంది బుక్కయినట్టేనా? హైదరాబాద్లో ఏసీబీకి వెంకట్రెడ్డి ఎలా చిక్కాడు? న్యాయస్థానం ఎంతవరకు రిమాండ్ విధించింది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ప్రకృతి సంపద దోపిడీకి పాల్పడిన వైసీపీ నేతలకు టెన్షన్ మొదలైంది. దాదాపు 2500 కోట్ల రూపాయల మేరకు ప్రభుత్వ ఖనాజాకు నష్టమని చెబుతోంది. ఈ వ్యవహారంలో ఆనాటి ఇద్దరు పెద్దల ప్రమేయమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకరు మాజీ మంత్రి, మరొకరు కీలక నేతగా తెలుస్తోంది. వీరితోపాటు మరో ఇద్దరు నేతలు, ఇద్దరు అధికారులున్నట్లు తెలుస్తోంది. వెంకట్రెడ్డి అరెస్ట్ తర్వాత ఆ నేతలు ఏపీని వదిలిపెట్టినట్టు ఓ రూమర్ బయటకు వచ్చింది.
ఇంతకీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి పోలీసులకు ఎలా చిక్కాడు? అన్నదే అసలు ప్రశ్న. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తట్టా బుట్టా సర్దుకుని తొలుత హైదరాబాద్కు చెక్కేశారాయన. ఈలోగా చంద్రబాబు సర్కార్ డిపార్ట్ మెంట్ ఎంక్వైరీ వేసిన తర్వాత హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు.
వెంకటరెడ్డి కోస్ట్గార్డు అధికారి కావడంతో తనకున్న రిలేషన్స్తో ఢిల్లీలోని మిలటరీ కంటోన్మెంట్లో 50 రోజులపాటు తలదాచుకున్నారు. అదే సమయంలో ఏపీ అధికారులు కోస్టుగార్డు అధికారులను సంప్రదించిన విషయం తెలుసుకున్న వెంకటరెడ్డి, అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
ALSO READ: సంతకం పెట్టాల్సి వస్తుందనే వెళ్లలేదు, జగన్కు ఏ నోటీసులు ఇవ్వలేదు: చంద్రబాబు
ఢిల్లీ నుంచి హైదరాబాద్కు మకాం మార్చేశారు వెంకటరెడ్డి. శంషాబాద్ సమీపంలోని సుల్తాన్పల్లిలో అత్యంత ఖరీదైన రిసార్ట్స్లో మకాం వేశారు. వెంకటరెడ్డి కదలికలపై నిఘా పెట్టిన ఏపీ అధికారులు, గురువారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకోవడం, వెంటనే అక్కడి నుంచి విజయవాడకు తరలించడం చకచకా జరిగిపోయింది.
తన ఆరోగ్యం బాగా లేదంటూ కొత్త డ్రామాను మొదలుపెట్టాశారాయన. గడ్డం పెంచుకున్న అనారోగ్యం బారిన పడ్డానని నమ్మించే ప్రయత్నం చేశారు. శుక్రవారం ఏసీబీ అధికారులు ఆయనను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అక్టోబరు 10 వరకు రిమాండ్ విధించింది. న్యాయస్థానం నుంచి నేరుగా విజయవాడ జైలుకి తరలించారు అధికారులు.
గనుల శాఖలో అక్రమాలపై డీటేల్స్ రెడీ చేసిన అధికారులు, వెంకటరెడ్డిని కస్టడీకి తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నారు. వెంకటరెడ్డి ఇచ్చిన ఆధారాలతో మరో ఇద్దర్ని, అధికారులు, లేదా వైసీపీ నేతలను అదుపులోకి తీసుకునే అవకాశమున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.