NASAs InSight Lander:ఎన్ని ఫొటోలు తీసినా… ఫస్ట్, లాస్ట్ ఫొటోలకు ఉన్న కిక్ ఇక దేనికీ రాదు. ఈ కెమెరాతో తీసిన ఫస్ట్ ఫొటో ఇది. ఈ కెమెరాతో తీసిన లాస్ట్ ఫొటో ఇది. ఇలా చెప్పుకోవడం చూస్తుంటాం. ఇక ఇప్పుడు ఇన్ సైట్ ల్యాండ్ రోవర్ వంతు వచ్చింది. మార్స్ పైకి నాసా పంపిన ఈ ల్యాండ్ రోవర్ ఇప్పటికే వేలాది ఫొటోలు తీసి పంపింది. కానీ తాజాగా పంపిన ఒక ఫొటోకు… మార్స్ పై ఇన్ సైట్ ల్యాండ్ రోవర్ తీసిన ఫొటోకు ఇదే చివరిది కావొచ్చు అనే క్యాప్షన్ తో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది నాసా.
భూకంపాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే అంగారక గ్రహం(మార్స్)పై కూడా ప్రకంపనలు ఏమైనా వస్తున్నాయా అని తెలుసుకోడానికి 2018లో ఇన్ సైట్ ల్యాండ్ రోవర్ ని పంపింది నాసా. మార్స్ పై దిగిన వెంటనే ఈ ల్యాండ్ రోవర్ పనిచేయడం మొదలు పెట్టింది. మార్స్ అంతర్గత నిర్మాణంపై కీలకమైన సమాచారాన్ని సేకరించి నాసా శాస్త్రవేత్తలకు పంపించింది. ఇప్పటికే అది పనిచేయడం మొదలు పెట్టి నాలుగేళ్లయింది. ఇక దీని జీవితకాలం ముగిసిపోవడానికి దగ్గర పడింది. అందుకే తన శక్తి తక్కువైపోయిందని, ఇదే చివరి ఫొటో కావచ్చని వెల్లడించింది. దీనికి కారణం రోవర్ పై ఉన్న సోలార్ ప్లేట్లపై దుమ్ము, దూళి పేరుకుపోయింది. దీనివల్ల సోలార్ ఎనర్జీని పొందే శక్తి తగ్గిపోయింది. అందుకే ఇదే నా చివరి ఫొటో కావచ్చు. మిషన్ టీంతో సాధ్యమైతే మాట్లాడుతూ ఉంటాను. త్వరలో సైన్ ఆఫ్ చేస్తాను. నాతో ఇన్నాళ్లు ఉన్నందుకు ధన్యవాదాలు అని ఇన్ సైట్ ల్యాండ్ రోవర్ పంపిన సందేశాన్ని నాసా ట్విట్టర్ లో షేర్ చేసింది. దీనికి లైకులు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి శక్తి క్షీణిస్తున్నట్లు నవంబర్ 10నే నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా అప్పుడే ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ల్యాండ్ రోవరే స్వయంగా తన శక్తి చాలడం లేదంటూ మెసేజ్ పంపించడం ఆసక్తికరంగా మారింది.