ఎన్నికల్లో ఓటమి తర్వాత కనిపించకుండా పోయిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలతో కలిసి మీడియా ముందుకొచ్చిన మరో మాజీ మంత్రి పేర్ని నాని ఎప్పటిలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ అన్ని మతాలు తనకు సమానమనే చెప్తున్నారు. అయితే ఒక హిందువుగా తిరుమల లడ్డుని అపవిత్రం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ మతంపై తాజాగా పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పేర్ని నాని ఉద్దేశపూర్వకంగా ఆ వెటకారపు వ్యాఖ్యలు చేశారో లేక తన పాత సహచరులు చాలా కాలానికి కలిసారన్న అత్యుత్సాహంతో మాట్లాడారో కాని.. ఆయన జనసైనికులకు ఒక రేంజ్లో టార్గెట్ అయ్యారు. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి ముందు ధర్నాకు దిగారు. పవన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఓటమి పాలైనప్పటి నుంచి గుడివాడలో ముఖం చాటేసిన కొడాలి నాని లడ్డు వ్యవహారంపై సిట్ విచారణను తప్పుపడుతూ చంద్రబాబు, లోకేష్లపై విమర్శలు గుప్పించారు. తిరుమల ప్రసాదాల్ని ఆహార పదార్ధాలని మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.
Also Read: ధర్మారెడ్డి ఎక్కడ? ఆచూకీ చెబితే నజరానా
ఇప్పటికే విజిలెన్స్ విచారణల్లో తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యితో పాటు నాసిరకం ఏలకులు, జీడిపప్పు వాడినట్లు తేలింది. జగన్ పాప ప్రక్షాళన అంటూ కొండెక్కడానికి సిద్దమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లా మాజీలు పవన్ కళ్యాన్ మతంపై మాట్లాడుతూ, సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ సిట్ అధికారులను కించపరిచేలా మాట్లాడుతూ సిట్యుయేషన్ని మరింత హీట్ ఎక్కిస్తున్నారు. అటు కేంద్రంలో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వమే సీఎం, డిప్యూటీ సీఎంలు అనుకుంటే సీబీఐని రంగంలోకి దించడం పెద్ద పనేమీ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నానిలు ఇద్దరు మాట్లాడుతున్న తీరుపై వారి వైఖరిపై వైసీపీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి ఈ డ్యామేజ్ని జగన్ ఎలా కంట్రోల్ చేసుకుంటారో చూడాలి.