SchoolBoy Human Sacrifice: విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అపోహలు, మూఢనమ్మకాలతో సమాజం వెనకబడిపోతుంది. కానీ ఆ విద్యకు నిలయమైన ఓ పాఠశాలలో తాంత్రిక పూజలు జరుగుతున్నాయి. విద్యను బోధించే టీచర్లే నరబలి ఇచ్చారు. అది కూడా ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఈ కేసులో పోలీసులు అయిదుగురిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రస్ నగరానికి సమీపంలో ఉన్న రస్గవాన్ అనే గ్రామంలో డిఎల్ పబ్లిక్ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఓనర్ జసోధన్ సింగ్. ఆయన కుమారుడు దినేశ్ బఝేల్ స్కూల్ డైరెక్టర్ పదవిలో ఉన్నాడు. అయితే జసోధన సింగ్ కు మూఢనమ్మకాల పిచ్చి ఉంది. ఆయనకు తాంత్రిక పూజలు, చేతబడి విద్య అంటే అపార నమ్మకం. మరోవైపు తన స్కూల్ కు రాష్ట్ర స్థాయిలో పేరు రావాలని జసోధన సింగ్ కోరిక. తన కోరిక నెరవేరాలంటే ఒక చిన్నపిల్లాడిని నరబలి ఇవ్వాలని ఆయనకు ఓ తాంత్రికుడు చెప్పడంతో జసోధన్ సింగ్ అదే పనిలో పడ్డాడు.
Also Read: ఫారిన్లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..
అందుకుగాను తన స్కూల్ లో చదివే ఒక పిల్లాడిని బలిఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తన కుమారుడు స్కూల్ డైరెక్టర్ దినేశ్ ని పిలిచి.. ఈ విషయం చెప్పాడు. తన తండ్రి చెప్పిన మాటలకు దినేశ్ అంగీకరించాడు. అలా సెప్టెంబర్ 6న స్కూల్ హాస్టల్ లో ఉన్న ఒక 9 ఏళ్ల పిల్లాడిని నరబలి ఇవ్వాలని ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. దీంతో తాంత్రికుడు త్వరగా ఒక పిల్లాడిని తీసుకురావాలని సూచించాడు. దీంతో మళ్లీ స్కూల్ హాస్టల్ లో ఉన్న 11 ఏళ్ల క్రితార్థ్ ని ఎంచుకున్నాడు. క్రితార్థ్ స్కూల్ లో 2వ తరగతి చదువుకుంటున్నాడు.
రెండు రోజుల క్రితం స్కూల్ పరిసరాల్లో ఉన్న బావి వద్ద తాంత్రికుడు క్షుద్ర పూజలకు అంతా సిద్ధం చేశాడు. రాత్రి అందరూ పడుకున్నాక.. హాస్టల్ లో నిద్రపోతున్న క్రితార్థ్ ని స్కూల్ డైరెక్టర్ దినేశ్, మరో ముగ్గురు టీచర్లు కలిసి బలవంతంగా బయటికి తీసుకొచ్చారు. కానీ క్రితార్థ్ గట్టిగా కేకలు వేయడంతో అతడి నోరు మూయించేందుకు ప్రయత్నించే క్రమంలో.. క్రితార్థ్ ఊపిరి ఆడకుండా చనిపోయాడు. దీంతో మరోసారి వారు నరబలి ఇవ్వడంలో విఫలమయ్యారు. అయితే ఈసారి పిల్లాడు చనిపోవడంతో అతని హత్యను కప్పిపుచ్చడానికి.. క్రితార్థ్ తండ్రికి ఫోన్ చేసి.. హాస్టల్ క్రితార్థ్ అనారోగ్యంగా ఉన్నాడని చెప్పారు.
Also Read: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..
క్రితార్థ తండ్రి వెంటనే బయలుదేరి స్కూల్ హాస్టల్ వద్దకు చేరుకోగా.. క్రితార్థ్ ని స్కూల్ డైరెక్టర్ దినేశ్ తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లాడని తెలిపారు. క్రితార్థ్ తండ్రి ఆస్పత్రి కోసం బయలు దేరుతుండగా.. దినేశ్ తన కారులో అక్కడికి చేరుకున్నాడు. క్రితార్థ్ చనిపోయాడని.. అతని శవం కారులో ఉందని చూపించారు. ఇదంతా చూసి క్రితార్థ్ తండ్రికి నమ్మకం కలుగలేదు. ఏదో తప్పు జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసులో వెంటనే విచారణ ప్రారంభించగా.. స్కూల్ వార్డన్ నిజం చెప్పేయడంతో విషయం బయటపడింది.
ఆ రోజు రాత్రి టీచర్లు, దినేశ్ కలిసి క్రితార్థ్ ని బలవంతంగా హాస్టల్ నుంచి తీసుకెళ్లడం చూశానని.. స్కూల్ వెనుకభాగంలో ఏదో జరిగిందని చెప్పాడు. ఇదంతా విని పోలీసులు వెంటనే స్కూల్ వెనుకభాగంలో గాలించగా.. తాంత్రిక పూజ కోసం చేసిన ఏర్పాట్లు ఉన్నట్లు గమనించారు. క్రితార్థ్ హత్య కేసులో పోలీసులు.. ముగ్గురు టీచర్లు, స్కూల్ ఓనర్ జసోధన్ సింగ్, స్కూల్ డైరెక్టర్ దినేశ్ ని అరెస్టు చేశారు.