Tulasi Pooja: పురాణముల ప్రకారము, పూర్వము ఒక అందమైన గంధర్వ కాంత ఉండేది. ఆమె తనకు ఒక మంచి భర్త కావలెనని కోరుకుంది. అందుకోసం ఆమె ధ్యానం చేయడం, వ్రతములను ఆచరించడం, తీర్థ యాత్రలు చేయడం లాంటి ఎన్నో పుణ్య కార్యములను చేసింది. ఒకరోజు ఆమె శ్రీ గణపతి ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. వెంటనే అతని పట్ల ఆకర్షితురాలైంది. గణపతిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ఆమె ఓ ఏకదంతా, ఓ లంబోదరా, ఓ వక్రతుండా అని పిలిచింది. దీంతో ధ్యానానికి ఆటంకం కలిగడంతో శ్రీ గణపతి కళ్లు తెరిచి చూశాడు.
ఎదురుగా గంధర్వ కాంతను చూసిన ఆయన ఓ మాతా, నా ధ్యానమునకు నీవు ఎందుకు ఆటంకం కల్పిస్తున్నావు? అని ప్రశ్నించాడు. అందుకు ఆమె నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. అందుకు శ్రీ గణపతి నేను ఎన్నడూ పెళ్లి చేసుకుని బంధం అనే ఉచ్చులో చిక్కుకోను చెప్పగా… ఆ గాయకురాలు మీరు తప్పక వివాహమాడతారు అని శపించింది. వెంటనే శ్రీ గణపతి నువ్వు భూమి మీద ఓ చెట్టుగా జన్మిస్తావు అని ప్రతి శాపం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆమె తన ప్రవర్తనకు పశ్చాత్తాప పడి క్షమించమని వేడుకోగా… అప్పుడు శ్రీ గణపతి ఓ మాతా! నిన్ను శ్రీ కృష్ణుడు వివాహం చేసుకుంటాడు, నీవు సంతోషంగా ఉంటావని ఆశీర్వదించాడట. ఆ తరువాత ఆమె భూమి పై తులసి మొక్కగా పుట్టింది. శ్రీ గణపతి తులసి మొక్కను ఎప్పుడూ ఆదరించలేదు. కాబట్టి, తులసి దళములను ఆయనకు ఎప్పుడూ సమర్పించరు. వాటితో పూజించరు.
వినాయకుడికి తులసి పూజ చేయకపోవడానికి మరో కారణం కూడా చెబుతారు. గణపతి ముఖ్యముగా కామితార్థముల కోసం ఆరాధిస్తారు. కానీ తులసి మొక్క నిర్లిప్తతను సూచిస్తుంది కాబట్టి తులసి దళాలను గణపతికి సమర్పించడం నిషేధించారు.