Kejriwal Slams PM Narendra Modi: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో జైలుకు వెళ్లొచ్చిన తరువాత ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీఎంగా రాజీనామా చేసిన తరువాత మొదటిసారిగా కేజ్రీవాల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే హోదాలో ఆయన శాసన సభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
‘నేను, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అసెంబ్లీలో చూసి ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఆశ్చర్యపోయి ఉంటారు. ప్రధాని మోదీ చాలా శక్తివంతమైన వ్యక్తి, కానీ, ఆయన దేవుడు కాదు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. దేవుడి ఆశీర్వాదాలు మాకు అండగా ఉన్నాయి. సుప్రీంకోర్టుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అంటూ కేజ్రీవాల్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: బెంగళూరు హత్య కేసులో ట్విస్ట్.. సంచలనంగా మారిన సూసైడ్ నోట్
‘ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే నన్ను జైలులో పెట్టారంటూ ఒక బీజేపీ సీనియర్ నేత నాతో చెప్పారు. అయితే, అప్పుడు నేను అన్నాను వారితో… నన్ను ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో.. అదే మాదిరిగా నాకు హెల్ప్ చేయమని కోరాను. అప్పుడు అతను నాకు చెప్పాడు నన్ను అరెస్ట్ చేసి మొత్తం ఢిల్లీ ప్రభుత్వ పెద్దలను కూడా అడ్డుకోగలిగామన్నారు. అతను చెప్పింది విని నేను షాకయ్యాను. ఢిల్లీ ప్రజల జీవితాన్ని నాశనం చేయాలని ఆలోచన ఉన్న బీజేపీ పార్టీ అదేం పార్టీయో నాకు అర్థంకాలేదు’ అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
కాగా, ఎమ్మెల్యే హోదాలో సభకు హాజరైన కేజ్రీవాల్ కు అసెంబ్లీలో 41వ నెంబర్ సీట్ ను కేటాయించారు. ఆయన గతంలో కుర్చున్న నెంబర్ 1 సీటులో ప్రస్తుత సీఎం అతిషీకి కేటాయించారు.
Also Read: ‘నేమ్ బోర్డులో హోటల్ యజమాని వివరాలు తప్పనిసరి’.. ఆదేశాలు జారీ చేసిన యూపీ సిఎం!
ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేముందు సీఎం అతిషీతో కలిసి ఆయన ఢిల్లీ యూనివర్సిటీ వద్ద డ్యూమేజ్ కు గురైన రోడ్డును పరిశీలించారు. తాను జైలు నుంచి వచ్చానని, ఇక నుంచి పెండింగ్ పనులన్నీ వెనువెంటనే కంప్లీట్ చేస్తామంటూ ఆయన హామీ ఇచ్చారు. ‘ఈ పనులన్నీ ఆగడానికి కారణం కేంద్ర ప్రభుత్వం. వాళ్లు నన్ను జైలులో ఉంచి ఈ పనులు ముందుగు సాగకుండా చేసి అభివృద్ధిని అడ్డుకున్నారు. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం. అదేవిధంగా ఢిల్లీ వ్యాప్తంగా రోడ్ల మరమ్మతు పనులను చేపట్టి, అవి వెనువెంటనే పూర్తి చేస్తాం. నేను జైలు నుంచి బయటకు వచ్చాను. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. మీ సమస్యలన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తాం’ అంటూ కేజ్రీవాల్ అన్నారు.