Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించి ఏలూరు రాజకీయాల్లో కలకలం రేపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం పాటు తన మార్క్ రాజకీయాన్ని నడిపించిన మాజీ ఉపముఖ్యమంత్రి రాజకీయాలకు గుడ్ బై చెప్తూ నిర్ణయం తీసుకోవడంతో అయన సన్నిహితులు షాక్ తిన్నారు. ఆయన ఇప్పుడు తన నిర్ణయం మార్చుకున్నారా? గోదావరి జిల్లాల్లో బలమైన శక్తిగా మారిన జనసేన వైపు చూస్తున్నారా? వివాదరహితుడైన కాపునేత ఆళ్ల నానితో జనసైనికులే టచ్లోకి వెళ్తున్నారా?చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలోనే పార్టీ మారని ఆళ్ల నాని ఇపుడు జనసేన బాట పడతారా?
ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కాగడా గుర్తుతో మొదలైన ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత ఇక ముగిసిందనే అందరూ భావించారు. జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించిన ఆళ్ల నాని ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించి తన అనుచరులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఏలూరు నియోజకవర్గం లో ఏడు సార్లు పోటీ చేసి మూడుసార్లు గెలుపొందారు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్.. వివాద రహితుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆళ్ళ నాని.. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వైఎస్ మరణాంతరం జగన్ వెంట నడిచారు.
గోదావరి జిల్లాలలో బలమైన కాపు సామాజికవర్గం నుండి వచ్చిన నేత అయినప్పటికీ ఆళ్ల నాని ఏ రోజూ కుల సంఘం నేతగా ముద్ర వేయించుకోలేదు. అలాగే కాపు కులం కార్డు కూడా రాజకీయాల్లో వాడకుండా తనదైన స్టైల్లో ఏలూరులో పట్టు పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు సామజిక వర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు గుప్పించారు. అయితే వైసిపి పెద్దలు ఆదేశించినా ఆళ్ల నాని మాత్రం వాటిని ఖాతరు చేయకుండా హుందాగానే వ్యవహరించారు. తక్కువ మాట్లాడటం, అనవసర విషయాలపై స్పందించకపోవడం ఆళ్లనాని నైజం అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆళ్ల నాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు.
Also Read: చంద్రబాబు సర్కార్పై బీజేపీ ఒత్తిడా? రాజాసింగ్ కొత్త డిమాండ్, ఏమిటి?
ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగన్కు లేఖ రాసి సైలెంట్ అయిపోయారు. ఆయన రాజీనామాతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి దెబ్బ గట్టిగానే తగిలింది. ఆళ్లనాని బై బై వైసీపీ అనడంతో జిల్లాలో వైసీపీ అనాధలా తయారైంది. ఏలూరు మేయర్, కార్పొరేటర్లు, ఏలూరు సిటీ పార్టీ అధ్యక్షుడు ఇలా అందరూ వైసీపీని వీడి తమదారి చూసుకోవడంతో పార్టీ ఖాళీ అయింది.
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని పేరు ఇప్పుడు జనసేన చేరికల లిస్ట్లో ఫోకస్ అవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా సుదీర్గ కాలం రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆళ్ళ నానితో జనసేన పార్టీ ముఖ్య నేత టచ్ లోకి వెళ్లారంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో ఇప్పటికే బలమైన శక్తిగా ఎదిగిన జనసేనలోకి ఆళ్లనాని వస్తే మరింత బలోపేతం అవుతుందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాపు సామజిక వర్గం కావటం, సౌమ్యుడు గా గుర్తింపు కావడంతో ఆళ్ళ నానికి ఏలూరు జిల్లా భాద్యతలు అప్పచెప్పేందుకు జనసేన నేతలు అడుగులు పావులు కదుపుతున్నారంట. ఏలూరు జిల్లా పగ్గాలు ఆళ్ళ నాని కి అప్పగిస్తే ఎలా ఉంటుందని గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు జనసైనికుల దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారంట.
ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో వైసీపీకి రాజీనామా చేసిన నేతలు అందరూ టీడీపీలో చేరిపోయారు. జనసైనికులు సైతం తమ గ్లాస్ ఫుల్ చేసుకునేందుకు పావులు కడుపుతున్నారంట. సీనియర్ పొలిటీషన్ ఆళ్లనాని జనసేనలో చేరితే.. మరికొంతమంది వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తారని జనసైనికులు భావిస్తున్నారు. ఒకవేళ ఆళ్లనాని జనసేన పార్టీ లో చేరితే ఆయనకి ఏ పదవి ఇవ్వాలి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారట జనసేన నేతలు. పదవుల కోసం కాదు. 2019లో రెండు చోట్లా ఓడిపోయినా పవన్ కళ్యాణ్ పార్టీని నిలబెట్టిన తీరు, ఆయన పట్టుదల తనకెంతో నచ్చిందని.. దసరా లోపు తన నిర్ణయం చెప్తానని ఆళ్ళ నాని జనసేన ముఖ్య నేతలతో చెప్పినట్లు తెలిసింది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ సిగ్నల్ కోసం ఏలూరు జిల్లా జనసైనికులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.