Rivers and Coins: భారతీయులకు నదులు అంటే ప్రాణం. నదులను ఎంతో పవిత్రంగా చూస్తారు. పురాతన కాలం నుంచి కూడా నదులకు ప్రజలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడంటే ఇంటి వరకు కొళాయిలు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు నదికే వెళ్లి నీటిని తెచ్చుకునేవారు. వాటిని తాగేవారు, వాటితోనే స్నానాలు చేసేవారు. అందుకే నదే మానవాళికి జీవనాధారంగా మారింది. అనేక సంస్కృతులలో నదులను దేవతలుగా పూజించడం ప్రారంభించారు. హిందూ మతంలో కూడా నదులు దేవతా స్వరూపాలే.
భారతదేశంలో ఉన్న గంగా, యమున, గోదావరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవనదులు ఉన్నాయి. గంగానదిని ‘మా గంగ’ అని పిలుచుకుంటారు. అంటే గంగానది తల్లి లాంటిది అని చెప్పడమే. గంగానదిని పరమ పవిత్రంగా చూస్తారు. ఆమె శివుని నివాసమైన స్వర్గం నుండి భూమికి వస్తుందని నమ్ముతారు. భగీరథుడు గంగను భూమి పైకి తీసుకొచ్చాడని కథలుగా చెప్పుకుంటారు.
నదిలో నాణాలు ఎందుకు?
గంగానదే కాదు గోదావరి, యమునా, వంశధార, తుంగభద్రా… ఇలా ప్రతి నదికి ఒక కథ ఉంది. నదిని దేవతగా ప్రార్థించి పువ్వులు, పండ్లతో, పసుపు,కుంకుమలతో పూజలు కూడా చేస్తారు. ముఖ్యంగా నది కనిపించగానే నాణేలను విసరడం చేస్తూ ఉంటారు. మన దేశంలో ఈ ఆచారం ఎక్కువగా ఉంది. నదుల్లో నాణాల్ని ఎందుకు విసురుతారో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
నాణాలు వేయడం వెనుక కారణాలు
నదుల్లో నాణాలు విసరడం వరకు ఆర్థిక కారణాలతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు రాగి నాణాలే వాడుకులో ఉండేవి. రాగిలో శుభ్రపరిచే గుణాలు ఎక్కువ. ఎప్పుడైతే రాగి నాణేలను నీటిలో వేస్తామో, అవి నీటిని శుభ్రపరుస్తాయని నమ్మేవారు. ఇలా రాగి నాణేలను వేయడం వల్ల నదిలోని నీళ్లు శుభ్రపడతాయని అప్పట్లో నమ్మకం. ఇప్పుడైతే వాటర్ ప్యూరిఫైయర్లు వచ్చాయి. అప్పుడు ఇలా రాగి నాణేలను నదిలోకి విసరడం ద్వారా నీటిని శుద్ధి చేసేవారు.
రాగి కలిపిన నీళ్లు ఎలాంటి వ్యాధులకు కారణం కావని, ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయని నమ్మే వాళ్ళు నాణేలను నదిలోకి విసురుతూ ఉంటారు. రాగి నాణేలను నదిలోకి విసిరినప్పుడు రాగిలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు, ఆ నదిలో ఉన్న బ్యాక్టీరియాలను, మలినాలను, వైరస్లను తొలగిస్తాయి. అవి తాగేందుకు సరిపడేలా చేస్తాయి. తాగునీరు మనకు ప్రాణ శక్తిని అందిస్తుంది. కాబట్టి ఎక్కడ నది కనబడినా రాగి నాణాలను వేయడం పూర్వం నుంచి అలవాటుగా మారింది.
లక్ష్మీదేవికి నైవేద్యం
మరొక నమ్మకం ప్రకారం నదిలోని రాగినాణాలను వేయడం వల్ల లక్ష్మీదేవికి నైవేద్యాన్ని సమర్పించడంతో సమానం అని నమ్ముతారు. ఇలా రాగి నాణేలను లేదా సాధారణ నాణేలను నదిలో వేస్తే సంపద శ్రేయస్సు పెరుగుతాయని వివరిస్తారు. నదిలో నాణాలు వేయడం ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానమని అంటారు.
Also Read: అక్టోబర్లో ఈ రాశి వారి జీవితంలో డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి కూడా ఉందా ?
పాశ్చాత్య సంస్కృతిలో ఫౌంటైన్ లో నాణాలను విసరడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారికి అదృష్టం వస్తుందని నమ్ముతారు. ప్రతి దేశంలో ఇలాంటి ఆచరాలు ఎన్నో ఉన్నాయి.