Nirmala: ఉచితాలకు కేంద్రం, బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వాల ఉచితాలపై కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వస్తోంది. తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ఉచితాలు, రాయితీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన ఓ కామెంట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. నిర్మలా తప్పుబట్టింది మనల్నేనా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ నిర్మలా సీతారామన్ ఏం అన్నారంటే…
“ఒక రాష్ట్ర ప్రభుత్వం సమయానికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉద్యోగులంతా జీతాల కోసం నిరసనకు దిగారు. ఆ ప్రభుత్వం నిధులను దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలకు ఖర్చు చేయడమే ఈ దుస్థితికి కారణం. రాయితీలు, ఉచితాలు సందర్భోచితంగా ఉండాలి. ఆదాయం ఉంటే డబ్బులు ఇవ్వొచ్చు. విద్య, ఆరోగ్యం, రైతులకు పలు రాయితీలు ఇవ్వడం న్యాయమైనవి.” అని అన్నారు నిర్మలా సీతారామన్.
ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపుతున్నాయి. మంత్రి ప్రస్తావించింది తెలంగాణ గురించా? లేదంటే, ఏపీని ఉద్దేశించా? అనే చర్చ మొదలైంది. రెండు రాష్ట్రాల్లోనూ జీతాలు ఇవ్వలేని దుస్థితి. తెలంగాణ, ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు ఇస్తున్నారు. ఏపీలో అయితే పరిస్థితి మరింత దారుణం. ఉద్యోగుల అకౌంట్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్న ఘటన వివాదాస్పదమైంది. మరి, నిర్మలా చేసిన కామెంట్లు ఏ రాష్ట్రం గురించి?
ప్రభుత్వం నిధులను దేశవ్యాప్తంగా భారీ ప్రకటనలకు ఖర్చు చేయడమే ఈ దుస్థితికి కారణం అని నిర్మల అనడంతో.. ఆ వ్యాఖ్యలు తెలంగాణ గురించేనని అంటున్నారు. ఎందుకంటే కొన్నినెలలుగా జాతీయ మీడియాలో, పలు రాష్ట్రాల పత్రికల్లో.. ఢిల్లీ వీధుల్లో.. తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇచ్చింది. దేశమంతా కేసీఆర్ పేరు, తెలంగాణ డెవలప్ మెంట్ ను ఘనంగా ప్రచారం చేశారు. అందుకే, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని కేంద్రమంత్రి తెలంగాణ గురించే అన్నారని చెబుతున్నారు.
మరోవైపు, ఉద్యోగులంతా జీతాల కోసం నిరసనకు దిగారని కేంద్రమంత్రి అనడాన్ని బట్టి.. ఆ విమర్శ ఏపీ గురించే అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఆందోళనబాట పట్టారు. ఏపీ సర్కారు భారీగా ఉచితాలు అమలు చేస్తోంది. ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఇలా నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలన్నీ ఏపీకి సరిగ్గా సరిపోతాయని అంటున్నారు.
ఇలా ఉచిత హామీలు, ఉద్యోగులకు జీతాలు ఆలస్యంపై పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా తెలంగాణ, ఏపీ పాలనపై చర్చ నడుస్తోంది. మన ప్రభుత్వాల తీరుపై విమర్శలూ వస్తున్నాయి.