హైదరాబాద్, స్వేచ్ఛ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని, సర్పంచ్లు పనులు చేయించి పెట్టిన బిల్లులు విడుదల చేయక మోసం చేసిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్లుతున్నదని, గ్రామ పంచాయతీలను, సర్పంచ్లను విస్మరిస్తున్నదని ఆరోపించారు. బిల్లులు రాక చాలామంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంకా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జయంతి వేడుకల్లో భాగంగా ఈటల మాట్లాడారు.
Also Read: కాళేశ్వరంపై విచారణ… ప్రశ్నలు దాటేసిన పద్మావతి.. జస్టిస్ అసహనం
ఎన్నికలెప్పుడు?
గ్రామ పంచాయతీ, సర్పంచ్ సమస్యలపై ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చాలా మాట్లాడారని, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక మౌనం దాల్చారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. బిల్లులు విడుదల కాక సుమారు 60 మంది సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారని స్వయంగా రేవంత్ రెడ్డే అన్నారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు సర్పంచ్ల గురించి, జీపీ పెండింగ్ బిల్లుల ఊసే ఎత్తడం లేదన్నారు. సర్పంచ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా పలకరించే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లు పడే వరకు సర్పంచ్ల సమస్యల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వారిని పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. సర్పంచ్ల పదవీకాలం పూర్తయి ఏడు నెలలు గడుస్తున్నా ఇంకా ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడం లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోతున్నదని, జీపీలో పారిశుధ్య కార్మికులుగా చేస్తున్నవారికి నెలలుగా జీతాలు అందడం లేదని వివరించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి గ్రామాలను వల్లకాడుగా మార్చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. వెంటనే రిజర్వేషన్లను తేల్చి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
Also Read: ఆ ఒక్కటి మాత్రం మాకు అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు : మంత్రి ఉత్తమ్
డెడ్లైన్:
దసరాలోపు జీపీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్లతోపాటుగా తాము ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. మిమ్మల్ని ఎక్కడికక్కడికి అడ్డుకునేందుకు సర్పంచ్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సర్పంచ్ల ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.