Bhimili red sand hills: ఎట్టకేలకు విశాఖలోని భీమిలి ఎర్రమట్టి దిబ్బలు కాపాడేందుకు ఓ అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం రెడ్ సాండ్ హిల్స్ సమీపంలో జరుగుతున్న తవ్వకాలను ఆపాలంటూ స్టే ఇచ్చింది హైకోర్టు. దీంతో ఎక్కడి పనులకు అక్కడ బ్రేక్ పడినట్లైంది.
విశాఖ జిల్లా భీమిలి రెడ్ సాండ్ హిల్స్ భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఎర్రమట్టి దిబ్బల సమీపంలో భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి గతంలో భూములు కేటాయించారు. ఆయా భూముల్లో ఉన్న ఎర్రమట్టి దిబ్బలను తవ్వి చదును చేస్తోంది సొసైటీ.
ఇటీవలకాలంలో ఈ పనులు మరింత వేగవంతం అయ్యాయి. దీనిపై అన్నివర్గాల నిరసనలు రావడంతో హైకోర్టులో పిటిషన్లు దాఖలైంది. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, మత్య్సకార నాయకుడు శంకర్ వేసిన పిటిషన్లు వేశారు.
ఎర్రమట్టి దిబ్బలు తవ్వుతున్న ప్రదేశం వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సొసైటీ పనులు చేస్తోందని పేర్కొన్నారు. పిటిషన్ల తరపు వాదనలు విన్న న్యాయస్థానం.. పనులు ఆపాలని కోరుతూ జీవీఎంసీ, ఇతర సంబంధిత శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ALSO READ: సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి
శతాబ్దాల కిందట ఎర్రమట్టి దిబ్బలు ఏర్పడ్డాయి. 1978లో అప్పటి ప్రభుత్వం భీమిలి సమీపంలోని తొట్లకొండలో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నట్లు గుర్తించింది. దాన్ని నిషేధిత జోన్గా పేర్కొంది. 2021లో ఎర్రమట్టి దిబ్బలను 120 ఎకరాలకే పరిమితం చేసిందని పర్యావరణ వేత్తల ప్రధాన ఆరోపణ. మొత్తం ఎన్ని ఎకరాల్లో మట్టి దిబ్బలు ఉన్నాయో సర్వే చేయించాలని కోరుతున్నారు.
భీమునిపట్నం ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 1982లో భూములు కోరింది. అందులో 373 ఎకరాలు ఇవ్వగా అందులో 91 ఎకరాలు జియో హెరిటేజ్గా గుర్తించి వెనక్కి తీసుకున్నారు. 280 ఎకరాల్లో వివాదం రేగుతోంది. సుప్రీంకోర్టులో హౌసింగ్ సొసైటీకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే వారసత్వ సంపదకు ఆనుకుని ఉండడంతో అక్కడ తవ్వకాలపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.