Kiraak RP: ప్రస్తుతం తిరుపతి లడ్డు అపవిత్రం అనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో కలుషిత నూనెలు కలిశాయన్నది ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై ప్రజల తరపున పలువురు సెలబ్రిటీలు స్పందించారు. కేవలం తెలుగు సెలబ్రిటీలు మాత్రమే కాదు.. తమిళ సెలబ్రిటీలు సైతం దీని గురించి మాట్లాడడానికి ముందుకొస్తున్నారు. తాజాగా ‘జబర్దస్త్’ ఫేమ్ కిర్రాక్ ఆర్పీ కూడా తిరుపతి లడ్డు కాంట్రవర్సీపై స్పందించాడు. వందశాతం తిరుపతి లడ్డులో కలుషిత నూనె కలిసిందని, అందుకే ల్యాబ్ రిపోర్ట్ అలా వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బాబాయ్నే చంపేశాడు
‘‘తిరుపతి లడ్డు విషయంలో తప్పు చేసినవారికి వెంటనే శిక్షపడుతుంది. ఒకరి కాదు అందరూ దీనికి కారకులే. ఎవరు టెండర్లు వేశారు, ఎవరు నెయ్యి కొనుగోలు చేశారు, ఎవరు దీన్ని ప్రోత్సహించారు.. ఇలాంటి వాటి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. వారికి సంబంధించిన డేటా అంతా బయటికి వస్తే వెంటనే శిక్ష పడుతుంది. తిరుపతి లడ్డును రెండు నెలలు అయినా ఇంట్లోనే పెట్టుకుంటాం. మిగతా ప్రసాదాలు అలా పెట్టలేం. కానీ వాటిలో కూడా ఏమైనా కలుషితమైనవి వాడారా అనే సంగతి తెలియదు. సొంత బాబాయ్ను చంపేస్తేనే దిక్కులేదు. ఇప్పటికీ జగన్ ప్రెస్ మీట్ పెట్టి నేను చంపలేదు అంటున్నాడు. అలాంటివాడికి లడ్డులో కొవ్వు కలపడం పెద్ద విషయమా?’’ అంటూ తన స్టైల్లో దీనిపై స్పందించాడు ఆర్పీ.
Also Read: నేను చెప్పిందేంటి.. మీరు తిప్పుతున్నదేంటి.. పవన్ పై ప్రకాష్ రాజ్ ఫైర్
స్పందించకపోవడం మంచిది
‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డు అనేది సెన్సిటివ్ విషయం అని కార్తి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. దాని గురించి కూడా ఆర్పీ ఫైర్ మాట్లాడాడు. ‘‘ఆ హీరో మాట్లాడింది తప్పు. అందుకే పవన్ కళ్యాణ్ స్పందించడంలో తప్పు లేదు. జరిగిన విషయం గురించి అందరూ బాధపడుతున్నప్పుడు దానిని జోక్గా మార్చకూడదు. కొన్నింటి గురించి లోతుగా ఆలోచించాలి. జోక్గా కాకపోయినా వాటి గురించి వెంటనే స్పందించకపోవడమే మంచిది. లడ్డు అనేది చిన్న విషయం కాదు’’ అని అన్నాడు. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ గురించి మాట్లాడుతూ.. ఎవరి నమ్మకాలు వాళ్లవి అని తక్కువ చేసి చూడొద్దని సీరియస్ అయ్యాడు.
చంద్రబాబే కారణం
పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షపై వైసీపీ నేతలు కామెంట్ చేయగా వాళ్లు తప్పుడు మనుషులు కాబట్టి తప్పుపడతారు అన్నాడు ఆర్పీ. ఇటీవల రోజా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో తాగేసి మాట్లాడిందంటూ ఆర్పీ వ్యాఖ్యలు చేశాడు. దానిపై మరోసారి స్పందించాడు. ‘‘ఆమె తాగి మాట్లాడిందని నేను తాగకుండా చెప్పాను. ఆమె తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి డబ్బులు సంపాదించుకుంటుంది. ఆమెకు విలువలు ఉండవు. వెంకటేశ్వర స్వామి అంటే గౌరవం ఉండదు’’ అని అన్నాడు. వైసీపీ ప్రభుత్వం ప్రతీదానికి చంద్రబాబే కారణం అని అంటుండగా.. అవును ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా చంద్రబాబే కారణం అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు ఆర్పీ.