Tirupati laddu Controversy in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తిరుమల లడ్డూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని తారాస్థాయికి తీసుకొని వెళ్తున్నారు. హిందూవులంతా ఏకం కావాలన్న నినాదాలు సైతం వినిపిస్తున్నాయి. సిట్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తామని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ తరుణంలోనే హైకోర్టు, సుప్రీం కోర్టులో ఈ వ్యవహారంపై పిటిషన్ లు సైతం దాఖలు అయ్యాయి. నేతల మధ్య డైలాగ్ వార్ రోజురోజుకీ మరింత మదురుతోండడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని తారా స్థాయికి తీసుకొని వెళ్తున్నారు. మంత్రులు, మాజీ మంత్రులే కాకుండా.. ఈ ఇష్యూలోకి సీఎం, మాజీ సీఎం కూడా ఎంట్రీ ఇచ్చి వివాదాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్లారు. సిట్ని నియమించి సమగ్ర విచారణ చేయిస్తామని.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ సీఎం చంద్రబాబు ఇచ్చారు. కౌంటర్గా ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు వైసీపీ నేతలు. మొత్తంగా ఈ వ్యవహారం రాజకీయంగా కుదిపేస్తోంది.
గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వ్యవహారాలపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ కీలక సూచనలు చేశారు. TTD ఆస్తులు, భగవంతుడి ఆభరణాలకు గత ప్రభుత్వం… రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులనే తనఖా పెట్టిన గత పాలకులు.. దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉందని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. టీటీడీలోని గత పాలక మండలి స్వామి వారి నిరర్థక ఆస్తులని అమ్మే ప్రయత్నం చేసిందని.. తమిళనాడులో 23 ఆస్తులు, గుంటూరు,రంగారెడ్డి, హైదరాబాద్లో పలు ఆస్తులను అమ్మకానికి పెట్టారని పవన్ ఆరోపించారు. తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతుంది. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తిరుమలకు వెళ్లారు. భూమన ప్రమాణం చేస్తుండగానే పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
ఇక తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వివాదంపై విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించారు. తిరుమల లడ్డూ వివాదంలో కూటమి సర్కారు చేస్తున్న ప్రచారాన్ని న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి తప్పుబట్టారు. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సర్కారు ప్రవర్తించిందని.. దీనిపై విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జ్ ద్వారా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేయగా.. ఆయన తరుపును పొన్నవోలు వాదనలు వినిపించారు. వేల రూపాయల ఖరీదైన యానిమల్ ఫ్యాట్ను తక్కువ ధరకు వచ్చే నెయ్యిలో కలిపారని అనటం హాస్యాస్పదమన్నారు.
Also Read: తిరుమలలో దోషం ఎలా పోగొట్టారంటే..
100 రోజుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే లడ్డు గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ చేశారు. లడ్డు గురించి విచారణ జరపాలని ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారని అన్నారు. ఈఓ శ్యామలరావుని కీలు బొమ్మలా మార్చి చంద్రబాబు ఆడిస్తున్నాడని మండిపడ్డారు. జూన్ లో ఎవరి ప్రభుత్వం ఉంది ? ఒకవేళ ఆ నెయ్యిని జూన్, జూలైలో వాడిఉంటే తప్పు ఎవరిది అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంది చంద్రబాబు కాదా అని దుయ్యబట్టారు
ఇప్పటికే మాజీ మంత్రి రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయంలో కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా పలు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారని రోజా గుర్తు చేశారు. లడ్డూ ప్రసాదంలో టేస్ట్ మారి ఉంటే.. అప్పుడెందుకు ప్రశ్నించ లేదని ఆమె నిలదీశారు. చంద్రబాబు డైవెర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని రోజా ఆరోపించారు.
జగన్ లేఖ రాయడంపై చంద్రబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. తప్పులు చేసిన తప్పించుకోవడం, ఎదురు దాడి చేయడం వైసీపీ స్టైల్ అన్నారు. తిరుమల క్షేత్రంలోని సాంప్రదాయాలను వైసీపీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతారని విమర్శించారు. భూమన కుమార్తెకు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేశారని గుర్తుచేశారు. అబ్దుల్ కలాం, సోనియా కంటే జగన్, వైసీపీ నేతలు గొప్పవారా అని ప్రశ్నించారు సీఎం.
మరోవైపు తిరుమలలో ప్రాయశ్చిత్త కార్యక్రమం ముగిసింది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంతో TTD అధికారులు సంప్రోక్షణతో పాటు శాంతి హోమం నిర్వహించారు. ఉదయము 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలో యాగం నిర్వహించారు. పూర్ణాహుతి తర్వాత పంచగవ్వ ద్రవ్యాలతో ఆలయంలోని అన్ని పోట్లలో సంప్రోక్షణ చేశారు. అన్నప్రసాద పోటు, లడ్డు పోటు, ఉగ్రాణము, లడ్డు కౌంటర్లు, బూందీ పోర్టు, వరాహ స్వామి సంప్రోక్షణ నిర్వహించారు. దేవుడి విషయంలో కల్తీ ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వివాదం రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.