గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది కూటమి. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో 14కు 14 అసెంబ్లీ స్థానాలు.. 2 ఎంపీ స్థానాలు కూడా గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ఇక నాటి నుంచి జిల్లాలో తమదే ఆధిపత్యం అంటూ నేతలు ఫుల్ గా సంబరపడ్డారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు టీడీపీకి సానుభూతిపరులుగా ఉన్న ఉద్యోగులు, అధికారులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ హయంలో ఇబ్బందులు పడ్డామని.. కూటమి సర్కారు రావడంతో ట్రాన్స్ ఫర్లకి డోకా ఉండదని భావించారు. కానీ తీరా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా కూడా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు పరిస్థితి ఉండడం పట్ల నేతలతో పాటు అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత పది రోజులుగా ట్రాన్స్ ఫర్ ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. దగ్గర ప్రాంతాలకు బదిలీలు చేయించుకొని వెళ్లాలనుకొని ఎన్నో ఆశలతో ఉన్న.. అనేకమంది టీడీపీ సానుభూతి ఉద్యోగులకు.. ఉన్నతాధికారులు చుక్కలు చూపిస్తున్నారని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు, రెవెన్యూ, పోలీస్.. జడ్పీ సహా పలు శాఖల్లోని ఉద్యోగులు.. దగ్గర ప్రాంతాలకు ట్రాన్స్ ఫర్ చేస్తారని భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ బదిలీల మ్యాటర్ లో సీన్ రివర్స్ కావడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా అనేకమంది ఉద్యోగులకు ఇటీవలే స్థానచలనం కల్పించారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లోని కానిస్టేబుల్స్.. రెవెన్యూ శాఖలోని డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ లను బదిలీ చేశారు. అయితే వీరిలో అనేక మంది ఉద్యోగులు స్థానిక ప్రజాప్రతినిధులని కలసి తమను వారి దగ్గర ప్రాంతాలకు.. ట్రాన్స్ర్ ఫర్ చేయాలని సిఫార్సు లేఖలను తీసుకున్నారట. ఆ లేఖలను జిల్లా పరిపాలన కార్యాలయంలో కూడా అందజేశారట. కానీ అనూహ్యంగా రెండు రోజుల క్రితం జరిగిన బదిలీల్లో.. కోరుకున్న చోటికి కాకుండా వేరే సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం పట్ల అందరూ షాక్ తిన్నారని చర్చ జరుగుతోంది.
Also Read: ఆరు నెలలకే కథ రివర్స్.. అయోమయంలో కాటిపల్లి
దీంతో సిఫార్సు లేఖలను తీసుకొని.. ఉద్యోగులు ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారట. అయితే అసలు బదిలీల విషయమే తెలియని ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు ఆ ట్రాన్స్ ఫర్ కాగితాలను చూసి దిక్కు తోచని స్థితిలో పడ్డారట. కనీసం ఏ ఒక్కరికి కూడా చెప్పిన చోటికి బదిలీ చేయలేదని.. జిల్లాలోని ఉన్నతాధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. జిల్లా మొత్తంగా 73 మంది డిప్యూటీ తహసీల్దారులను, 35 మంది ఆర్ఐ లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వీరంతా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తీసుకున్న వారేనని అనుకుంటున్నారు.
ఈ ఊహించని పరిణామాలతో అసలు జిల్లాలో ఏం జరుగుతుందో.. తమకు అర్థం కావడం లేదంటూఅధికార పక్షం ఎమ్మెల్యేలు తల పట్టుకుంటున్నారట. చివరికి మంత్రులకు కూడా తెలియకుండా ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులపై గుర్రుమని ఉన్నట్టు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్టు వినిపిస్తోంది. వీరిద్దరికీ సమన్వయం లేకపోవడంతోనే.. మిగతా సిబ్బంది నలిగిగిపోతున్నారని ఉద్యోగవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బదిలీలపై ఫైర్ అవుతున్న నాయకులు వారి సానుభూతిపరులను ఎలా కూల్ చేస్తారు ? గతంలో మాదిరి ఈసారి కూడా ట్రాన్స్ ఫర్ లను రద్దు చేస్తారా ? లేక అలాగే కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది.