Tirumala Laddu Row: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. వైసీపీకి వ్యతిరేకంగా హిందుత్వాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపేందుకు భయమెందుకని ప్రశ్నించిన అంబటి.. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని నిరూపించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపించాలంటూ ప్రకాశ్రాజ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. తిరుమల లడ్డూపై సీబీఐతో విచారణ జరిపించాలని దేశమంతా అడుగుతోందన్నారు.
తిరుమల లడ్డూలో నిజంగా కల్తీ నెయ్యి వాడారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో తప్పించుకుంటున్నారని విమర్శించారు అంబటి. తప్పు జరిగిపోయిందంటూ కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తున్నాయని, నిజాలు నిర్థారణ కాకుండా అలాంటి వార్తల్ని ఎలా రాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు రాష్ట్రంలో మత ఘర్షణలు లేపేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.
Also Read: సనాతన ధర్మం జోలికి వస్తే వదిలేది లేదు.. ప్రకాష్ రాజ్ జాగ్రత్త : పవన్ వార్నింగ్
ఆరోపణలను నిరూపించలేక హంగామా చేస్తున్నారని దుయ్యబట్టారు. హిందూ సంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని, ఆయన తన తండ్రి చనిపోయినపుడు కూడా తలనీలాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని, హిందూత్వం గురించి తమకెవ్వరూ చెప్పనక్కర్లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అంబటి రాంబాబు.