Director: తిరుపతి లడ్డూ వివాదం రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెల్సిందే. ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని తెలియడంతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టాలని ఏపీ సీఎం సిట్ కు బాధ్యతలను అప్పగించిన విషయం కూడా విదితమే. ఇక తిరుపతి లడ్డూ వివాదంపై ప్రముఖులు కూడా తమ మద్దతును తెలుపుతున్నారు. దీనిపై సోషల్ మీడియా లో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకొస్తున్నారు.
కొంతమంది టీడీపీదే తప్పు అంటుంటే.. ఇంకొంతమంది వైసీపీది అని చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది అసలు ఇదేమి పట్టనట్టు ఉండిపోయారు. అయితే తాజాగా తమిళ్ డైరెక్టర్ ఒకరు.. తిరుపతి లడ్డూ వివాదం గురించి మాట్లాడుతూ తమిళనాడు ప్రసాదం గురించి తప్పుగా మాట్లాడడం మరింత సెన్సేషన్ సృష్టిస్తోంది. తమిళ్ డైరెక్టర్ జి. మోహన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” మనకు తెలిసిన గుడిలో ప్రసాదంగా ఇచ్చే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతారని విన్నాను” అంటూ మాట్లాడాడు.
తమిళనాడులోని పళని అరుల్మికు తాండాయుతపాణి ఆలయంలో నిర్మిస్తున్న పంజామృతం ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఇలాంటివి కలుపుతున్నారని ఆరోపణలు రావడంతో తమిళనాడు షాక్ కు గురైంది. పళని ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు పోలీసులు మోహన్ ను నేడు అరెస్ట్ చేశారు. చెన్నై రాయపురంలోని అతని నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం గమనార్హం.
ఇక ఈ వివాదంపై తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ పళని ఆలయ పంచామృతం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జి మోహన్ .. ద్రౌపతి , రుద్రతాండవం, బగాసురన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఈ కేసు వై ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.