Secunderabad-Nagpur Vande Bharat Express: భారతీయ రైల్వేలోకి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రయాణీకుల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన ప్రతి చోటా ప్రయాణీకుల తాకిడి విపరీతంగా పెరిగింది. చక్కటి వసతులు, త్వరగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉండటంతో వందేభారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు మొగ్గు చూపుతున్నారు. దేశం అంతా వందేభారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉన్నా.. ఇటీవల ప్రారంభించిన సికింద్రాబాద్-నాగ్ పూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ పరిస్థితి మరోలా ఉంది. ఈ రైలు దాదాపు ఖాళీ కోచ్ లతో నడుస్తోంది. 80 శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. తెలంగాణలో ప్రారంభించిన ఐదవ వందే భారత్ రైల్లో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు ఆసక్తి చూపించకపోవడంతో రైల్వే అధికారులు షాక్ అవుతున్నారు.
సెప్టెంబర్ 16న సికింద్రాబాద్-నాగ్ పూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం
తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ప్రజలు పెద్ద సంఖ్యలో రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రూట్ లో సెప్టెంబర్ 16న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. రెండు రాష్ట్రాల నడుమ ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కేంద్రాలతో అనుసంధానిస్తూ ఈ రైలును ప్రవేశపెట్టింది. ఈ ప్రాతాల మధ్య వ్యాపార సంబంధాలను సులభతరం చేసేందుకు ఈ రైలును తీసుకొచ్చింది. దీనికి ప్రయాణీకుల నుంచి కనీస స్పందన రాకపోవడం పట్ల అధికారులు అవాక్కయ్యారు. రెండు వైపులా 80% ఖాళీగా నడవడంతో ఆశ్చర్యపోతున్నారు. సికింద్రాబాద్-నాగ్ పూర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం నుంచి పరిస్థితి ఇలాగే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలులో మొత్తం 1,440 సీట్లు ఉన్నప్పటికీ 1,200 సీట్లకు పైగా ఖాళీగా ఉంటున్నట్లు అధికారులు వెల్లడించారు. 88 సీట్లు ఉన్నరెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లలో 10కి కాస్త అటు ఇటుగా ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకుంటున్నట్లు తెలిపారు.
బెంగళూరు, చెన్నై, విశాఖ రైళ్లకు ఫుడ్ డిమాండ్
అటు సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైళ్లు ఫుల్ డిమాండ్ తో నడుస్తున్నాయి. అన్ని వందేభారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ రేట్లు 90 శాతం నుంచి 100 శాతం మధ్య ఉన్నాయి. విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్ లో ఉండటం విశేషం.
సికింద్రాబాద్-నాగ్ పూర్ కోచ్ లు తగ్గించే అవకాశం?
సికింద్రాబాద్-నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ 7.15 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుంది. ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్లు, 18 చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. అన్నీ కలిపి 1,440 సీట్లు ఉన్నాయి. ఈ రైలు కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్లలో స్టాఫ్ లు ఉన్నాయి. ఈ ట్రైన్ కు అనుకున్న స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో కోచ్ల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నారు రైల్వే అధికారులు. ప్రస్తుతం ఈ రైలు 20 కోచ్ లు ఉండగా, ఎనిమిదికి తగ్గించి, 500 సీట్లకు పరిమితం చేయాలని ఆలోచిస్తున్నారు.