Onion Price Hike in telangana: ఉల్లి ధరలు ఘాటెక్కాయి. గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న ధరలు.. వారం రోజులుగా ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెెట్లో కేజీ ఉల్లిగడ్డ రూ.60కుపైగా పలుకుతోంది. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.30 ఉండగా.. ప్రస్తుతం రెట్టింపు పెరిగాయి. జిల్లాల వారీగా చూస్తే.. లభ్యత, డిమాండ్ ఆధారంగా వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలో కిలో ఉల్లి ధర రూ.80 వరకు పలుకుతోంది.
ఉల్లి ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే మరికొన్ని రోజుల్లో సెంచరీ కొట్టే అవకాశం ఉంది. గత కొంతకాలంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రతో పాటు తెలంగాణలోనూ ఉల్లికి డిమాండ్ పెరిగింది.
మరోవైపు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి సైతం ఉల్లి సరఫరా తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉల్లికి డిమాండ్ పెరిగింది. ఆంధ్రలో ఎక్కువగా కర్నూల్ జిల్లా ఉల్లి సాగుచేస్తుండగా.. ఈ సారి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఏకంగా కర్నూల్లో ఉల్లి విస్తీర్ణం 75 వేల ఎకరాలు నుంచి 20వేల ఎకరాలకు పడిపోయింది.
మహారాష్ట్రలోనూ ఉల్లి ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది విపరీతమైన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతోపాటు ఉల్లి సాగు పంటలకు కూడా నష్టం వాటిల్లింది. అలాగే ఉల్లి సాగు విస్తీర్ణం సైతం తగ్గడంతో డిమాండ్ తగినవిధంగా సరఫరా చేయలేకపోతున్నారు. దిగుబడి విపరీతంగా తగ్గుముఖం పట్టడంతో డిమాండ్కు తగిన విధంగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే మార్కెట్ అధికారులు ధరలను అమాంతం పెంచేశారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేసింది. దీంతో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం 4.7 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించడంతో ధరలు పెరిగినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. ఖరీఫ్ సాగు అందుబాటులోకి వస్తేనే ఉల్లి ధరలు అదుపులోకి రానున్నాయి.
ఇక, ఢిల్లీలో ఉల్లి ధర రూ.55 వరకు పలుకుతుండగా.. మొబైల్ కేంద్రాల ద్వార రూ.35కు విక్రయిస్తున్నారు. అయితే తెలంగాణకు బఫర్ స్టాక్ లో సరుకు వస్తుందనే విషయపై స్పష్టత లేదని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read: గోవా వెళ్లాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్.. తక్కువ ధరకే!
తెలంగాణలో ఉల్లి ధరలు విరివిగా ఉన్నాయి. హైదరాబాద్ రైతు బజార్లలో కేజీ ఉల్లి రూ.60 నుంచి రూ. 55 వరకు పలుకుతుండగా.. ఎర్రగడ్డలో రూ.55 పలుకుతోంది. కరీంనగర్లో రూ.55, నల్గొండలో రూ.65, వరంగల్లో రూ.68, మెదక్ జిల్లాలో రూ.80 వరకు పలుకుతోంది.