Satyam Sundaram Movie : తిరుపతి లడ్డు వివాదం ఇప్పుడు దేశాన్నే పట్టి ఊపేస్తుంది. ఇలాంటి వివాదంలో అనవసరంగా ఓ యాంకర్ కారణంగా ఇరుక్కున్న కార్తీ, దిగివచ్చి పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాంకర్ చేసిన పనికి హీరో బలి
ఎంతో భక్తితో తిరుమల శ్రీవారికి సమర్పించే ప్రతిష్టాత్మకమైన లడ్డూలో కల్తీ జరిగిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేల్చిన విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్ స్టార్ కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఇక ఈవెంట్లో యాంకర్ మంజుష “లడ్డూ కావాలా నాయనా…” అనే మీమ్ ని హీరో కార్తీకి చూపించడంతో, ఆయన “ఇప్పుడు లడ్డూ గురించి ఏం మాట్లాడొద్దు. అది చాలా సెన్సిటివ్ ఇష్యూ” అంటూ సైలెంట్ గా సైడ్ అయిపోయాడు.
అక్కడ కార్తీ నెగిటివ్ గా చెప్పింది ఏమీ లేకపోయినా విషయం పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళింది. కార్తీ కామెంట్స్ పై స్పందిస్తూ పవన్ “లడ్డూపై జోక్స్ వేస్తున్నారు. నిన్న జరిగిన ఒక ఈవెంట్ లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఒక హీరో అన్నాడు. మరోసారి ఇలా అనొద్దు. హీరోగా మీరంటే నాకు చాలా గౌరవం. హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించండి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించండి” అంటూ కార్తీపై పవన్ డైరెక్ట్ గానే ఫైర్ అయ్యారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. పవన్ కళ్యాణ్ అభిమానులు లడ్డూ గురించి కార్తి చేసిన కామెంట్స్ పై విరుచుకు పడుతున్నారు.
పాపం కార్తీ… లడ్డూ చూపించి గుండు కొట్టించింది…
అయితే నిజానికి ఇదంతా యాంకర్ మంజూష చేసిన తప్పే అంటున్నారు నెటిజన్లు. ఈ సెన్సిటివ్ ఇష్యూ గురించి ఆమె కాస్త చూసుకొని మాట్లాడి ఉంటే కార్తీ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉండేది కాదు. ఇక కార్తీ విషయానికి వస్తే తెలుగు ఆడియన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని తమిళ మీడియా ముందు కూడా ధైర్యంగా చెప్తాడు. అలాగే తెలుగు ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమకు ఫిదా అవుతానని ఎన్నోసార్లు చెప్పాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ కి కార్తీ అంటే ఇష్టం కూడా. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అయితే కార్తీ నార్మల్ గానే వివాదాలకు దూరంగా ఉంటారు. అందుకే కార్తీని తెలుగు ప్రజలు కూడా బాగా ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు యాంకర్ మంజూష వల్ల ఆ పరిస్థితి మొత్తం తారుమారయ్యే సిచువేషన్ వచ్చింది. ఆమె కొంచెం కూడా ఆలోచింకాకుండా ఈ టాపిక్ ని తీసుకొచ్చి, కార్తీని అడ్డంగా ఇరికించింది. అప్పటికి కార్తీ స్మార్ట్ గా సమాధానం చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
క్షమాపణలు చెప్పిన కార్తీ…
కార్తీని ఇరికించి యాంకర్ మంజూషా బాగానే సైడ్ అయిపోయింది. తన సినిమా రిలీజ్ అవుతున్న తరుణంలో ఈ లడ్డూ వివాదం వల్ల పెరిగిపోతున్న నెగెటివిటీని దృష్టిలో పెట్టుకుని సారీతో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. సోషల్ మీడియాలో “ప్రియమైన పవన్ కళ్యాణ్ సార్.. మీరంటే చాలా గౌరవం ఉంది. ఇలా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామికి నేను వినయపూర్వకమైన భక్తుడిని. అలాగే ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తాను” అంటూ సారీ చెప్పాడు కార్తీ. దీనంతటికీ కారణం యాంకర్ మంజూష అని, ఏకంగా ఓ హీరోను వివాదంలో ఇరికించడమే కాకుండా, అతను అనవసరంగా తలదించుకునేలా చేసింది అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో తప్పు చేయకపోయినా సారీ చెప్పిన కార్తీ తీరుపై ప్రశంసలు కురిపిస్తూనే, తెలుగు అమ్మాయివి కదా ఆ మాత్రం తెలివి లేదా? అంటూ యాంకర్ పై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.