Bandi Sanjay : తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దొంగలు పడ్డాక ఆరు నెలలకు కేటీఆర్ స్పందించారని విమర్శించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు బయట పడిన సమయంలో ఎందుకు డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధంకాలేదని ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు ఛాలెంజ్ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
మంత్రి కేటీఆర్ డిప్రెషన్లో ఉన్నారని.. ఆయన ఫేస్లో భయం కనిపిస్తోందని బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ కిడ్నీ పాడైందన్నారు. మూన్నెళ్ల ట్రీట్ మెంట్ తర్వాత ఇప్పుడు పరీక్షలకు సిద్ధమంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నారనే విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. అసలు కేటీఆర్ ముందే టెస్టులు చేయించుకోవడానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం ఎందుకు విచారణ ఆపేసిందని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవిత.. ఎంపీ అరవింద్ను చెప్పుతో కొడతానని అన్నారని, సీఎం కేసీఆర్ తనను ఆరు ముక్కలు చేస్తానన్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇప్పుడు కేటీఆర్ చెప్పుతో కొడతానంటున్నారని , కుటుంబం మొత్తానికి డబ్బులు ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారని బండి ఫైర్ అయ్యారు. తాను తంబాకు తింటున్నానని కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకే పోరాటం చేస్తున్నామని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన పనితీరును ప్రశ్నించే ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల సంగతేంటో చెప్పాలని నిలదీశారు. వేములవాడకు, ధర్మపురికి ఇస్తామన్న నిధులేవి ? అని ప్రశ్నించారు. పైగా భక్తులిచ్చిన డబ్బులు వాడుకుంటున్నారని ఆరోపించారు. తీగలగుట్టపల్లి వంతెన మీ చుట్టం ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. తాను వచ్చాకే ఆర్ఓబీ కోసం కేంద్రం వాటాపై ఫైనాన్షియల్ సపోర్టు తెచ్చానన్నారు. రాష్ట్ర వాటా 80 కోట్లు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బీజేపీని బద్నాం చేయాలని ఇప్పుడు కొత్త నాటకమాడుతున్నారని మండిపడ్డారు. బూతులు తిట్టడం తప్ప వీరికి ఏదీ చేతకాదని బండి సంజయ్ విమర్శించారు.