Borabanda Bus Accident: బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. నిన్న ఉదయం స్కూల్ కి వెళ్లిన శివ చరణ్ (11) సాయంత్రం సైకిల్ పై రోడ్డుమీదికి వచ్చాడు. ఆ సమయంలోనే మరో స్కూల్ కి చెందిన బస్సు అటువైపుగా రాగా.. ప్రమాదవశాత్తు బస్సు చక్రాల కిందపడి మరణించాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
బోరబండలో ఉన్న సెయింట్ సలోమోన్స్ స్కూల్ లో శివ చరణ్ ఐదవ తరగతి చదువుతున్నాడు. స్కూల్ పూర్తయ్యాక శివచరణ్.. తన సైకిల్ పై ఎస్పీఆర్ హిల్స్ మహాత్మా నగర్ వైపు వచ్చాడు. ఆ సమయంలోనే కార్మికనగర్ నుంచి శ్రీసాయిచైతన్య పాఠశాలకు చెందిన బస్సు అటువైపు వచ్చింది.
Also Read: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం
విద్యార్థులతో వెళ్తున్న బస్సు.. బ్రహ్మశంకర్ నగర్ వద్ద టర్న్ అవుతున్న శివ చరణ్ ను ఢీ కొట్టి.. ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో శివచరణ్ మీది నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివచరణ్ మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.