Mumbi Actress Case: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ల చుట్టూ ఉచ్చుకుందా? రేపో మాపో వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారా? న్యాయస్థానం మంగళవారం వరకు ఛాన్స్ ఇచ్చిందా? కుక్కల విద్యాసాగర్ను కస్టడీకి తీసుకుంటున్నారా? ఈ వ్యవహారంలో తెర వెనుక సలహాదారులు పాత్ర బయటకు వస్తారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు వేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఏ1 కుక్కల విద్యాసాగర్, ఏ2 గా ఐపీఎస్ సీతారామాంజనేయలు, ఏ3గా కాంతిరాణా తాతా, ఏ4గా ఏసీపీ హనుమంతరావు, ఏ5గా సీఐ సత్యనారాయణ, ఏ6గా డీసీపీ విశాల్ గున్నీలను పేర్కొన్నారు అధికారులు.
పోలీసుల విచారణలో కుక్కల విద్యాసాగర్ కీలక విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది. టాప్ పోలీసు అధికారులు తనపై ఒత్తిడి చేసి ఈ కుట్రలో ఇరికించినట్టు చెప్పాడట. నిందితులుగా ఉన్న పోలీసులు, అన్నివిధాలుగా సహకరించారని చెప్పుకొచ్చారు. ఈ కేసు వెనుక కర్మ, కర్త క్రియ అన్నీ ఆ పోలీసు అధికారులే నంటూ వారిపై నెట్టేశాడు. అంతకుమించి తనకు ఏమీ తెలీదని చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.
నటి కేసులో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఐపీఎస్ అధికారి కాంతిరానా తాతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళవారం వరకు ఆయనపై ఎలాంటి చర్యలొద్దని పోలీసులను ఆదేశించింది.
ALSO READ: నూజివీడులో వైసీపీ కార్యకర్త నోటి దురుసు.. కాళ్లు చేతులు కట్టేసి, ఆపై..
దర్యాప్తుకు సహకరించాలని రానాకు సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండున జత్వానీపై విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడని ప్రభుత్వ లాయర్ తన వాదనలు వినిపించారు. ఫిబ్రవరి ఒకటిన నటిని అరెస్ట్ చేయడానికి ముంబై వెళ్లారని వివరించారు. ఈ క్రమంలో కేసు విచారణ నేటికి వాయిదా వేసింది.
ముగ్గురు ఐపీఎస్, ఏసీపీ స్థాయి అధికారులను అరెస్ట్ చేసి ప్రధాన నిందితుడ్ని దగ్గర పెట్టి విచారిస్తే ఈ కేసు కంక్లూజన్కు రావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విశాల్ గున్నీ చెప్పాల్సిన విషయాలు లిఖిత పూర్వకంగా విచారణ అధికారులకు రాసి ఇచ్చారు. ఇక సీతారామాంజనేయులు, కాంతిరానా తాతాలను విచారించాల్సి వుంది.
మంగళవారం న్యాయస్థానం ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సస్పెండయిన ఐపీఎస్లు.. తమ గోడును మిత్రుల వద్ద వెల్లబోసుకున్నట్లు తెలుస్తోంది. అందరూ కలిసి తమను ఈ కేసులో ఇరికించారని, అప్పటి ప్రభుత్వ పెద్దలు చెబితేనే తాము చేశామని అంటున్నారు. ఒకవేళ ఆయా ఐపీఎస్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటే ఈ కేసు ముగింపు వస్తుందని భావిస్తున్నారు.