Heavy Rain in Telangana: తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్లో రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్ నగర్ తార్నాక, ఓయూ క్యాంపస్, ఉప్పల్, బేగంపేట, నాంపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో అధికార యంత్రాంగమంతా వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా కీలకమైన కూడళ్లలో వరదనీరు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
Also Read: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!
అలాగే, ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలు, ట్రాఫిక్ జామ్ అప్డేట్స్ అందించాలని సీవీ ఆనంద్ తెలిపారు. దీంతోపటు నగరంలో ట్రాఫిక్ మేనేజ్ మెంట్ పై దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ట్రై పోలీస్ కమిషనరేట్లు, జీహెచ్ఎంసీ ఇతర విభాగాల ట్రాఫిక్ కమిషనర్ లు ఉంటారన్నారు.