Twitter : ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ సీఈఓ పదవికి గుడ్ బై చెప్పబోతున్నారు. ఆ బాధ్యతలను నిర్వహించగలిగే సమర్థుడు దొరికిన వెంటనే పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ఈ విషయాన్ని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఈ బాధ్యతలను తీసుకునే తెలివి తక్కువ వ్యక్తి దొరగ్గానే తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తానని ఆ పోస్టు లో మస్క్ పేర్కొన్నారు.
తర్వాత తాను సాఫ్ట్వేర్, సర్వర్ల బృందాలను చూసుకుంటానని ట్వీట్ చేశారు.
సీఈఓ పదవి నుంచి తప్పుకోవాలా వద్దా అన్నదానిపై ఇటీవల మస్క్ పోల్ నిర్వహించారు. ఈ పోల్ లో మెజారిటీ సభ్యులు మస్క్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. 57.5 శాతం మంది యూజర్లు మస్క్ వైదొలగాలని కోరారు. 42.5 శాతం మంది మస్క్ కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో మస్క సీఈవో పదవి నుంచి తప్పుకుంటారా అనే అంశంపై సర్వత్రా చర్చ జరిగింది. తాజాగా ఆయన చేసిన ప్రకటనతో ఆ చర్చలకు తెరపడింది.
మస్క్ కొత్త సీఈఓను వెతికే పనిలో పడ్డారు. అక్టోబర్ లో ట్విటర్ను సొంతం చేసుకున్న మస్క్.. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ట్విటర్లో విధానపరమైన మార్పులకు సంబంధించి నిర్వహించే పోల్లో కేవలం ట్విటర్ బ్లూ సబ్స్క్రైబర్లు మాత్రమే పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
మరోవైపు వెరిఫైడ్ ఖాతాల లేబుల్స్, బ్యాడ్జ్లకు సంబంధించి ట్విటర్ ఇటీవల కీలక వివరాలు ప్రకటించింది. బిజినెస్, ప్రభుత్వ ఖాతాలను సులువుగా గుర్తించేందుకు వేర్వేరు బ్యాడ్జ్లు, లేబుల్స్ ఇస్తామని తెలిపింది. ప్రభుత్వ ఖాతాలకు గ్రే బ్యాడ్జ్ ఇస్తామని ప్రకటించింది. బిజినెస్ ఖాతాలకు లోగో చతురస్రాకారంలో, గోల్డ్ కలర్ బ్యాడ్జ్ ఇస్తామని తెలిపింది. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ పొందిన ఖాతాలకు వెరిఫై చేసి బ్లూ బ్యాడ్జ్ ఇస్తామని ప్రకటించింది.
ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ కలిగిన సంస్థలు తమ ఖాతాలకు సంబంధించిన ఉద్యోగులు, అనుబంధ సంస్థల కార్యకలాపాలకు సంబంధించిన ఖాతాలను ప్రధాన ఖాతాకు అనుసంధానం చేయొచ్చు. ఇలా లింక్ చేసిన ఖాతాలకు పేరు కింది భాగంలో ప్రధాన ఖాతాకు సంబంధించిన వివరాలతో కూడిన లేబుల్ కనిపిస్తుంది. మానవ ప్రమేయం లేకుండా ఆటోమేషన్ ద్వారా నిర్వహించే ఖాతాలకు ఆటోమేటెడ్ అనే లేబుల్ ఇస్తామని ట్విటర్ సంస్థ తెలిపింది. సాధారణ యూజర్లు తమ ఖాతాలను ప్రొఫెషనల్ ఖాతాలుగా మారిస్తే, వాటికి యూజర్లు తమకు నచ్చిన లేబుల్ను ఎంచుకోవచ్చు. వీటికి వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉండదని స్పష్టం చేసింది.