TTD EO : టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంటి తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమారుడు చంద్రమౌళి (28) ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ మూడు రోజులపాటు మృత్యుతో పోరాడారు. చివరకూ చికిత్స పొందుతూ చంద్రమౌళి మృతిచెందారు. చంద్రమౌళికి అన్ని రకాల చికిత్సలు అందించినా ఫలితం దక్కలేదని వైద్యులు తెలిపారు. తొలుత వెంటిలేటర్పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఎక్మో ద్వారా చికిత్సను అందించారు. ఇలా ఆధునిక వైద్యం అందించినా చంద్రమౌళి తిరిగి కోలుకోలేకపోయారని వైద్యులు వెల్లడించారు.
వచ్చే నెలలో వివాహం..
పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్రెడ్డి కుమార్తెతో చంద్రమౌళికి ఇటీవల వివాహం కుదిరింది. కొన్నిరోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వివాహాన్ని తిరుమలలో నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. శుభలేఖలు పంచడం ప్రారంభించారు.
ఈ క్రమంలో చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి ఆదివారం మధ్యాహ్నం కారులో వెళ్లారు. ఆ సమయంలో గుండెనొప్పిగా ఉందని పక్కనే ఉన్న స్నేహితుడికి చెప్పారు. వెంటనే సమీపంలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల్లోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కర్నూలు జిల్లా నందికొట్కూరుకి చంద్రమౌళి మృతదేహాన్ని తరలించనున్నారు.